Students Parents Demanding Cancellation Of Ap Board Exam 2021
Cancel AP Board Exams 2021: దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ, థర్డ్ వేవ్ హెచ్చరికలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. CBSE ప్లస్ టూ బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉంటుందని, వారిలో ఒత్తిడి పెంచేలా.. పరీక్షల కోసం విద్యార్థులను బలవంతపెట్టకుండా పరీక్షలు రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించారు.
విద్యార్థుల పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న జగన్ సర్కార్.. ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ను వాయిదా వేసింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటది అనేదానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చర్చనీయాంశమైంది.
కోవిడ్ సెకండ్వేవ్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ, ఇంటర్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు సూచనలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్ ఎగ్జామ్స్ను వాయిదా వేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. దేశంలో దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లో టెన్త్ ఎగ్జామ్స్ను రద్దు చేయగా.. ఏపీలో మాత్రం రద్దు చేయలేదు.