నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి, విచారణకు సహకరించాలని రఘురామ రాజును ఆదేశించింది సుప్రీంకోర్టు.
రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించిన అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ సమయంలో కష్టడీకి తీసుకుని విచారించవలసిన ఆరోపణలు రఘురామపై లేవని, సోషల్ మీడియాలో గాని మీడియా ముందుకు గానీ రాకూడదని రఘురామరాజును ఆదేశిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
తనకు అయిన గాయాలను గతంలో చూపించినట్టుగా ఎక్కడా ప్రదర్శించకూడదని, విచారణను ప్రభావితం చేసే పనులు చేయరాదని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదవగా.. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించింది. విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రాఘురాజు సహకరించాలని ఆదేశించింది.
ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పిన సుప్రీంకోర్టు.. వారం రోజుల్లోగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తు ట్రయల్ కోర్టులో సమర్పించాలని సూచించింది.