Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు.. మరో ఇద్దరు మాజీ మంత్రులు, టీడీపీ నేతలపైనా..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో ఏ1గా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Harishth Thanniru
- Published On : August 9, 2023 / 10:32 AM IST
Chandrababu Naidu
Mudivedu Police Case On Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. చంద్రబాబుతోసహా మరో ఇద్దరు మాజీ మంత్రులు, 20మంది నాయకులపై అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంగళ్లు సభలో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసీ 120b, 147, 148,153, 307, 115, 109, 323, 324, 506 r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు పేరును చేర్చారు.
చంద్రబాబుతో సహా ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసు నమోదైంది. A2 మాజీ మంత్రి దేవినేని ఉమ, A3 గా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు టీడీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ భాష, దొమ్మలపాటి రమేష్, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గంటా నరహరి, శ్రీరామ్ చినబాబు, శ్రీధర్ వర్మలతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 10కి పైగా సెక్షన్ల కింద ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు పుంగనూరు ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న పంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 72కు చేరింది. పథకం ప్రకారమే టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడులు చేశారని చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 72 మందిని సోమవారం అర్థరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
