Nara Lokesh: యువగళం పాదయాత్ర 2వేల కి.మీ పూర్తి.. లోకేశ్‌కు అభినందనలు తెలిపిన చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. నువ్వు.. యువతకు అండగా నిలవడం, మన రాష్ట్ర ప్రజల ఆందోళనలకు అండగా ఉండడంచూసి గర్వపడుతున్నాను అంటూ చంద్రబాబు పేర్కొంటున్నారు.

Nara Lokesh and chandrababu

Chandrababu Naidu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ (Nara Lokesh)  చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) దిగ్విజయంగా కొనసాగుతోంది. లోకేశ్‌కు టీడీపీ (TDP) శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథంపడుతున్నారు. రెండు రోజుల క్రితమే 150 రోజులు పూర్తిచేసుకున్న యువగళం పాదయాత్ర.. తాజాగా రెండువేల కిలోమీటర్లు మైలురాయిని చేరుకుంది. 153 రోజులు 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకుంది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలో మీటర్ల మైలురాయిని యువగళం పాదయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో యువగళం పాదయాత్రలో పాల్గొని లోకేశ్ అభినందనలు తెలుపుతున్నారు.

Nara Lokesh: యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి.. నారా లోకేశ్ ఏమన్నారంటే?

యువగళం పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకూ దాదాపు 30లక్షలమంది ప్రజలను లోకేశ్ నేరుగా కలుసుకున్నట్లు అంచనా. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగగా.. 49చోట్ల బహిరంగసభలు, వివిధ వర్గాలతో 118 ముఖాముఖి సమావేశాల్లో లోకేశ్ పాల్గొన్నారు. వివిధవర్గాల ప్రజలనుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలను లోకేశ్ అందుకున్నారు.

లోకేశ్‌ను అభినందిస్తూ చంద్రబాబు ట్వీట్.. 

యువగళం పాదయాత్ర 2వేల కిలో మీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రాజకీయ, పలు వర్గాల ప్రముఖులు లోకేశ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ట్వీట్ చేశారు. నువ్వు.. యువతకు అండగా నిలవడం, మన రాష్ట్ర ప్రజల ఆందోళనలకు అండగా ఉండడంచూసి గర్వపడుతున్నాను అంటూ చంద్రబాబు పేర్కొంటున్నారు. యువతే మన భవిష్యత్తు. అభివృద్ధికి మంచి అవకాశాలను కల్పించడం ద్వారా తెలుగుదేశం వారి అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. లోకేశ్.. మిగిలిన ప్రయాణానికి నా శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

 

అంతకుముందు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2వేల కిలో మీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్వీట్ చేశారు. ఈరోజు 2వేల కిలో మీటర్ల యువగళం పాదయాత్ర పూర్తిచేసినందుకు ఆనందంగా ఉంది. ఇది దూరం మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ యువత కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రయాణం అని లోకేశ్ అన్నారు. నాతో చేరిన వారందరికీ ధన్యవాదాలు. కలిసి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. తదుపరి మైలురాయికి చేరుకుందాం అంటూ ట్వీట్ చేశారు.