ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా!
వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 31, 2024 / 10:22 AM IST
tdp janasena first list to release febraury first week
tdp janasena first list : ఎన్నికల సమరానికి సై అంటున్నాయి టీడీపీ-జనసేన. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రెండు పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబు-పవన్ కల్యాణ్.. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్పీడ్ పెంచారు టీడీపీ-జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్. రా.. కదలిరా సభలకు మూడు నాలుగు రోజులు విరామం ఇచ్చిన చంద్రబాబు.. హైదరాబాద్ చేరుకున్నారు. ఈ టైమ్లో అభ్యర్థుల జాబితా రెడీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకటి రెండ్రోజుల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఆ తర్వాత జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించే విషయంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై రెండు దఫాలుగా భేటీ అయిన ఇద్దరు నేతలు.. మూడోసారి మీటింగ్ తర్వాత తుది నిర్ణయానికి రానున్నారు.
Also Read: 70 ఏళ్ల రాజకీయానికి ఫుల్స్టాప్.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు గల్లా కుటుంబం దూరం
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చంద్రబాబు రా.. కదలిరా సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు రోజులపాటు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. అటు పవన్ కల్యాణ్ సైతం నాలుగో తేదీ నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈలోపే మొదటి లిస్టు విడుదల చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నారు.
Also Read: చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఏకమై చేస్తామంటే కుదిరే పనికాదు.. త్వరలో ప్రజలే తేలుస్తారు
వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు. పూర్తిస్థాయి కసరత్తు తర్వాత ఇద్దరూ కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల చేసిన తర్వాత చంద్రబాబు-పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అభ్యర్థుల జాబితాతో పాటు మ్యానిఫెస్టో విషయంలో స్పీడ్ పెరగడంతో రెండు పార్టీల నేతల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
