TDP Mahanadu: 15 వేల మందితో కమిటీలు, 15 తీర్మానాలు.. 28న 15 లక్షల మందితో సభ: అచ్చెన్నాయుడు
TDP Mahanadu: జగన్ పాలనలో విధ్వంసాలు, వినాశనంపై మహానాడులో తీర్మానం చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : May 12, 2023 / 11:40 AM IST
Atchennaidu
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో మహానాడు ప్రాంగణానికి ఇవాళ భూమి పూజ చేశారు. వేమగిరిలో ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహనాడును నిర్వహించనున్న విషయం తెలిసిందే. భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ నేతలు కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… “జగన్ పాలనలో విధ్వంసాలు, వినాశనంపై మహానాడులో తీర్మానం చేస్తాం. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 100 అతి పెద్ద సభలు ప్రారంభించాం. 27 వరకు 99 పూర్తి చేస్తాం. 28న ఎన్టీఆర్ శత జయంతి రోజు ముగింపు సభ. 15 వేల మందితో కమిటీలు, 15 తీర్మానాలు. 28న 15 లక్షల మందితో మహానాడు బహిరంగసభ” అని చెప్పారు.
“పోలీసు యంత్రాంగం సహకరించాలి. ఎంపీ భరత్ పుట్టిన రోజు సందర్భంగా నెలాఖరు వరకు ఆయన ఫొటోలే ఉండాలని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు వస్తే రాష్ట్రానికి దశ- దిశ వస్తుంది. జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేలా ఈ మహానాడు నిర్వహిస్తాం” అని అచ్చెన్నాయుడు అన్నారు.
కాగా, ఇప్పటికే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనూ టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 2024 ఎన్నికల రోడ్ మ్యాప్ నూ టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది.
