Ganta Srinivasa Rao : 100 రోజుల్లో ఏం చేస్తారు? దసరాకు విశాఖ నుంచి పరిపాలన అనేది డైవర్ట్ పాలిటిక్స్. .
తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఉంటే.. భయపడి దాక్కున్నారని లోకేశ్పై దుష్ప్రచారం చేస్తున్నారని గంటా శ్రీనివాస్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : September 23, 2023 / 12:41 PM IST
Ganta Srinivasa Rao
Chandrababu Naidu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ (Chandrababu Naidu Arrest) అక్రమమని, ఆయన నిర్ధోషిగా త్వరలోనే బయటకు వస్తారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అన్నారు. శనివారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా తెలుగోళ్లు స్పందిస్తున్నారని, ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని గంటా అన్నారు. దేశంలో ఏ పొలిటీషియన్పై లేని కేసులు
జగన్పై ఉన్నాయి. జగన్ బెయిల్పై బయటికి వచ్చి పదేళ్లు పూర్తయింది. జగన్ లాగే అందరిని జైలుకు పంపించాలని భావిస్తున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని విచారణ జరిపిన తరువాతే అరెస్టు చేశారని, దానికి భిన్నంగా చంద్రబాబు అరెస్ట్ జరిగిందని గంటా శ్రీనివాస్ రావు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో తొమ్మిది మంది IASలు పని చేశారు. ఒక్క అధికారిని ప్రశ్నించకుండా డైరెక్ట్ గా చంద్రబాబుపై కేసు పెట్టి అరెస్ట్ చెయ్యడం దారుణమని గంటా చెప్పారు.
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అక్రమంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు అడిగితే స్పీకర్ రిజెక్ట్ చేశారు. 23మంది టీడీపీ సభ్యుల కోసం 200 మంది మార్షల్స్ని పెట్టారు. అసెంబ్లీ మార్షల్స్ కేంద్రంగా తయారయ్యింది. దీనికి నిరసనగా మూడు రోజులు అసెంబ్లీని బహిష్కరించామని గంటా చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా స్కిల్ డెవలప్మెంట్ని ప్రశంసించారని, ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని, ఏయూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి గతంలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రశంసించారని, 2020లో సీఎం జగన్ కూడా ప్రభుత్వ ప్రకటన ఇప్పించారని గంటా తెలిపారు. అన్యాయంకు అన్ని రోజులు ఉండవు.. రేపనే రోజు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని గంటా దీమా వ్యక్తం చేశారు.
తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ఉంటే.. భయపడి దాక్కున్నారని లోకేశ్పై దుష్ప్రచారం చేస్తున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాకు విశాఖ నుంచి పరిపాలన అనేది డైవర్ట్ పాలిటిక్స్. జగన్ వచ్చి 100 రోజుల్లో ఏమి చేస్తాడు? ఇప్పటికే విశాఖలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. జగన్ వస్తే ఇంకా దారుణంగా తయారవుతుందని ప్రజలు భావిస్తున్నారని గంటా అన్నారు.
