Tdp Official Twitter Account Hacked, Confirmed By Nara Lokesh
TDP Twitter Hack : టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, తిరిగి అకౌంట్ పొందేందుకు ట్విట్టర్తో కలిసి పని చేస్తున్నామని అన్నారు. శుక్రవారం రాత్రి నుంచి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ అకౌంట్లో ఏవేవో విచిత్రమైన ట్వీట్లు వరుసగా కనిపించాయి.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022
ట్విట్టర్ అకౌంట్ రికవరీ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్ వివిధ రకాల పోస్టులను చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు.. ఏపీలో పెగాసస్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలు మరింత పొలిటికల్ హీట్ పెంచాయి. అధికారి పార్టీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ క్రమంలోనే టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ పెగాసస్ అంశంపై ప్రస్తావించారు. ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ, NSO గ్రూప్, స్పైవేర్ పెగాసస్ సాఫ్ట్వేర్ను రూ. 25 కోట్లకు విక్రయించేందుకు నాలుగు ఐదేళ్ల క్రితం తమకు ఆఫర్ ఇచ్చిందని మమత వెల్లడించారు. అప్పట్లో బెంగాల్ రాష్ట్ర పోలీసు విభాగానికి ఈ ఆఫర్ వస్తే తాము నిరాకరించినట్టు మమత వెల్లడించారు. స్పైవేర్ను రాజకీయంగా ఉపయోగించుకోవడం, న్యాయమూర్తులు, అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, అప్పుడే ఇజ్రాయెల్ పెగాసస్ ఆఫర్ను తిరస్కరించినట్లు మమతా స్పష్టంచేశారు.
మమతా వ్యాఖ్యలతో పెను దుమారం.. తీవ్రంగా ఖండించిన లోకేశ్ :
వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్వేర్ను అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ మమతా బెంగాల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది. మమత వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పెగాసస్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ క్రియేట్ చేసిన వారి నుంచి ఆఫర్ వచ్చిందన్నారు.
కానీ తాము దాన్ని తిరస్కరించామని లోకేశ్ స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయమన్నారు. ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. ఆ సమాచారం ఆధారంగానే ఆమె అలా అని ఉండొచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిజంగా పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకుండా ఉంటుందా అని లోకేశ్ ప్రశ్నించారు.
Read Also : Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!