TDP Rythu Poru : ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సై అంటే సై అంటున్నాయి. ప్రతి అంశంలో ఇరు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మాటల యుద్ధానికి దిగుతున్నారు. వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తున్న విపక్ష టీడీపీ.. వరుసబెట్టి నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు రూపొందిస్తూ, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా వ్యూహాలు రచిస్తోంది. తాజాగా టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పోరుబాట పట్టనుంది.
రైతు పోరుబాట పేరిట బహిరంగ సభలు నిర్వహించాలని తెలుగుదేశం. మొత్తంగా 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ తీర్మానించింది. ఈ నెల 20 నుంచి బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఏడు ప్రధాన సమస్యలపై రైతులను చైతన్య పరచడమే ప్రధాన ఎజెండాగా రైతు పోరుబాట సభలకు ప్లాన్ చేశారు చంద్రబాబు. తొలి సభను ఈ నెల 20న కడప పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్నట్లు టీడీపీ ప్రకటించింది.
* 20న కడప పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* 25న నెల్లూరు పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* జులై 1న కాకినాడ పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* జులై 7న విజయనగరం పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* జులై 13న విజయవాడ పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్
వ్యవసాయ మోటార్లకు మీటర్లు-రైతుల పాలిట ఉరితాళ్లు అనే అంశంపై ఈ సభల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అలాగే రైతు ఉత్పత్తులకు మద్దతు ధర, పంట నష్ట పరిహారం చెల్లింపు, పంట కాలువల మరమ్మత్తు-నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్యం, సూక్ష్మ పోషకాలు అంశాలపై బహిరంగ సభల్లో ప్రస్తావించనున్నారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు, జ్యోతుల నెహ్రూ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసి జనార్ధన్ రెడ్డి తదితరుల నేతృత్వంలో రైతు పోరుబాట బహిరంగ సభలు జరగనున్నాయి.