×
Ad

రామతీర్థంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పొలిటికల్ రగడ…విజయనగరం జిల్లాలో హైటెన్షన్

  • Published On : January 2, 2021 / 12:34 PM IST

High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర్యటనకు వెళ్లారు. రామతీర్థం కొండపైకి వెళ్లారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా రామతీర్థం వెళ్లనుండడంతో విజయనగరం పోలీసులు అలర్ట్ అయ్యారు. చంద్రబాబు వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరించారు. ముందస్తుగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో చంద్రబాబు రామతీర్ధం పర్యటనకు రానున్నారు. అటు రామతీర్ధం శ్రీరాముని ఆలయంలో విగ్రహ ధ్వంసం కేసులో… అనుమానితులైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకోవడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ వారిని అన్యాయంగా కేసులో ఇరికించారని బంధువులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

మరోవైపు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా రామతీర్థం పర్యటనకు వస్తుండడంతో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు వచ్చే సమయంలోనే…వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పర్యటనకు వస్తున్నారు. ఒకేసారి నేతల పర్యటనతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకింది. చంద్రబాబు వచ్చే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలోని ప్రఖ్యాత శ్రీరాముని ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం నుంచి తల భాగాన్ని వేరు చేసి కొండపైన ఉన్న కోనేరులో పడేశారు. విగ్రహం తల కోసం పోలీసులు, ఆలయ అధికారులు విస్తృతంగా గాలించగా..కోనేరులో లభ్యమయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

స్వామి వారి తల భాగాన్ని విగ్రహం నుంచి వేరుచేయడం దారుణమని మండిపడ్డాయి. విగ్రహం ధ్వంసం గురించి తెలుసుకున్న స్థానిక భక్తులు..కొండపైకి భారీగా చేరుకుని ఆందోళన జరిపారు. నాలుగు రోజులుగా ఈ ఘటనపై రాష్ట్రమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో టీడీపీ, వైసీసీ, బీజేపీ నేతలు పోటాపోటీగా పర్యటనకు వస్తుండడంతో ఉద్రిక్తత ఏర్పడింది.