×
Ad

Tenali Government Hospital : తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పేరుతో నిలువు దోపిడీ

కరోనా కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తుంటే...మరోవైపు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వైద్య సిబ్బంది మానవత్వం మరిచి డబ్బులపైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు.

  • Published On : April 25, 2021 / 08:44 AM IST

Tenali Government Hospital Employees Collecting Money From Corona Victims For Treatment

Tenali Government Hospital : కరోనా కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తుంటే…మరోవైపు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. మానవత్వం మరిచి డబ్బులపైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు వైద్య సిబ్బంది. కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులను ఉద్యోగులు నిలువు దోపిడీ చేస్తున్నారు. బెడ్ కావాలంటే ఒక రేటు.. చికిత్స చేయాలంటే మరో రేటు అంటూ కాసుల కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు.

డబ్బులు ఉన్నవాళ్లకే బెడ్‌లు కేటాయిస్తామని లేకుంటే వేరేవాళ్లకు కేటాయిస్తామని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు దొరకటమే గగనంగా మారింది. దానిని ఆసుపత్రి సిబ్బంది కాసుల వర్షంగా మార్చుకుంటున్నారు. పేదల పరిస్థితి కూడా అర్థం చేసుకోకుండా ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.

తెనాలికి చెందిన ఓ మహిళ అత్తమామలను కరోనా సస్పెక్ట్‌ కింద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఉండే వార్డ్‌ బాయ్‌ వెంకట్రావు 5 వేలు నుంచి 6వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని చెబితే.. రెండు వేల రూపాయలు తీసుకుని జాయిన్ చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మూడు వేల రూపాయలను ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె.

గుంటూరు జిల్లాలో ఒక్క రోజులోనే 15 వందల 81 కేసులు పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 94 వేల 306 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేల 620కి చేరింది. కరోనా బారినపడి 703 మంది మృత్యువాత పడ్డడారు. జిల్లాలో రోజురోజు కేసులు భారీగా నమోదవుతున్నాయి. అసలే కరోనాకు వైద్యం కోసం విలవిలలాడుతుంటే దోపిడీ దారుల చేతికి దోచుకుంటున్నారు. యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతున్నా పట్టించుకున్న వారు లేరు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.