ఏపీలో ముగిసిన మూడోదశ పంచాయతీ ఎన్నికలు..76.43 శాతం పోలింగ్
- bheemraj
- Published On : February 17, 2021 / 06:45 PM IST
third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖలో 60 శాతం ఓటింగ్ జరిగింది.
ఇక పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 3వేల 221 పంచాయతీలు, 19వేల 607 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 579 పంచాయతీలు, 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడవాడ గ్రామం పంచాయతీ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలింగ్ బూతులోనే వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకోవడంతో పోలింగ్ సిబ్బంది పరుగులు తీశారు. ఒకరి ఓటు మరొకరు వేయడంతో ఈ ఘర్షణ తలెత్తింది.
