AP Cancer Hospitals : ఏపీలో మూడు క్యాన్సర్ ఆసుపత్రులు.. అతి తక్కువ ధరకే చికిత్స
తిరుపతి, గుంటూరు- విజయవాడల మధ్య, విశాఖపట్నంలో 3 అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
- Naveen
- Published On : March 11, 2022 / 11:03 PM IST
Cancer Hospitals
AP Cancer Hospitals : ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్స, స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నోరి దత్తాత్రేయుడికి సీఎం జగన్ సూచించారు. తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ నిర్మాణం, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుపై నోరి దత్తాత్రేయుడు డీపీఆర్లను సీఎంకు అందజేశారు. క్యాన్సర్ చికిత్స అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
ఏపీ వాసులు క్యాన్సర్ వైద్య చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే చికిత్సలు తీసుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపిన జగన్.. అందుకు సహకరించాలని ఇదివరకే నోరిని కోరారు. ఈ విషయంలో ఏపీకి సహకరించేందుకు సిద్ధమేనని తెలిపిన నోరి.. తాజాగా ఆయా ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లను సీఎంకు అందజేశారు.
ఈ డీపీఆర్ల ప్రకారం తిరుపతి, గుంటూరు- విజయవాడల మధ్య, విశాఖపట్నంలో 3 అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తిరుపతిలో ఏర్పాటు కానున్న ఆసుపత్రిలో ప్రత్యేకంగా చిన్న పిల్లలకు క్యాన్సర్ వైద్యం అందించే ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే ఏపీ వాసులకు సొంత రాష్ట్రంలోనే క్యాన్సర్ చికిత్సలు అందనున్నాయి.
