Tirumala Srivari Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డి బుధవారం(సెప్టెంబర్ 14,2022) తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికోసం సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సెప్టెంబరు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.
సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న రథోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, న్యాయాధికారి శ్రీ రెడ్డెప్పరెడ్డి, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి తదితరులు పాల్గొన్నారు.
వాహన సేవల వివరాలు..
సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం జరుగనుంది. సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనం జరుగనుంది.
సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం జరుగనుంది. సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం ఉంటుంది. అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం జరుగనుంది.
Tirumala Srivari Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలు
అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనం జరుగనుంది. అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం ఉంటుంది.
అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనం జరుగనుంది. అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం ఉంటుంది.