Polling: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్తో పాటు కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది.
వీటితో పాటు రాష్ట్రంలోని మరో 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. 17న ఫలితాలు వెల్లడిస్తారు. అలాగే.. రేపు ఏపీలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 18వ తేదీన వెల్లడిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 13 పట్టణ స్థానిక సంస్థల్లో, ఖాళీలు ఏర్పడిన చోట్ల మొత్తం 325 మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) పూర్తి చేసింది.
నెల్లూరు కార్పొరేషన్లోని అన్ని డివిజన్లు, మిగిలిన 12 మున్సిపాలిటీల్లోని 311 వార్డులకు, ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన 14 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. 353 వార్డులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 28 వార్డులు ఏకగ్రీవం కావడంతో 325 స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 12వందల ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎనిమిది లక్షల 62వేల మంది ఓటర్లు ఓటు హక్కు వాడుకోనున్నారు. తొమ్మిదొందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 3వందల 98 కేంద్రాలను సమస్యాత్మకంగా, రెండొందల 62 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. ఐదొందల 27 పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.