మరో బాంబు పేల్చిన భాను ప్రకాశ్ రెడ్డి.. సంచలన విషయాలు బయటకు వస్తాయంటూ..
"వైసీపీ నేతలకు, భూమనకు ముందు ఉంది ముసళ్ల పండగ. వైసీపీ సెక్షన్ కాదు, ఇక ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి" అని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : September 21, 2025 / 05:54 PM IST
Bhanu Prakash Reddy
Bhanu Prakash Reddy: తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరో బాంబు పేల్చారు. ఇప్పటికే, గత వైసీపీ హయాంలో టీటీడీ పరకామణిలో పని చేస్తున్న రవికుమార్ దాదాపు రూ.100 కోట్లు చోరీ చేశారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు భాను ప్రకాశ్ రెడ్డి మళ్లీ దీనిపై స్పందిస్తూ.. “పరకామణి చోరీ వ్యవహారాన్ని ప్రైవేట్గా సెటిల్ చేశామని భూమన కరుణాకర్ రెడ్డి చెబుతుండడం విడ్డూరంగా ఉంది. దేవుడి దగ్గర దొంగతనం జరిగితే దానిని ప్రైవేటుగా సెటిల్ చేసే అధికారం సీఎంకే లేదు.
మరి వీళ్లు ఎలా చేస్తారు? వైసీపీ నేతలకు, భూమనకు ముందు ఉంది ముసళ్ల పండగ. వైసీపీ సెక్షన్ కాదు, ఇక ఐపీసీ సెక్షన్ లు పనిచేస్తాయి. రవికుమార్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎంను కోరుతాం. (Bhanu Prakash Reddy)
Also Read: జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం.. వారికి డబుల్ బొనాంజా..
దొంగ దొరికితే అతనిని పక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తారా? దొంగలందరూ దొంగతనం చేసి కరుణాకర్ రెడ్డి, వైసీపీ నేతల దగ్గరకు పోతే సెటిల్మెంట్ చేస్తారా? భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్నప్పుడే రవి కుమార్ దొంగతనం చేశాడు.
ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే రాజీ చేశారు. ఇప్పుడు నాకేం తెలియదు అన్నట్లుగా ఆయన డ్రామాలు ఆడుతున్నారు. సెటిల్మెంట్ నలబై కోట్లకు జరిగిందా? లేక నాలుగు వందల కోట్లకు జరిగిందా? నలబై కోట్ల ఆస్తులు కాపాడితే అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇది బయట పెట్టలేదు?
మరో రెండు రోజుల్లో సంచలన విషయాలు బయటకు వస్తాయి. ఈ కేసు సీబీఐ విచారణ అవసరం లేదు. ఎస్ఐ స్థాయి అధికారి చాలు. చూట్టు ఉన్నవాళ్లు జైలుకు వెళ్లడంతో భూమన కూడా జైలుకు వెళ్లడానికి ఉత్సాహపడుతున్నారు” అని అన్నారు.
