TTD EO : శ్రీవారి పుష్ప‌ ప్రసాదానికి భక్తుల నుండి విశేష ఆదరణ

టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి గోశాల‌, అగ‌ర‌బ‌త్తులు, డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీతో శ్రీ‌వారి చిత్ర‌ప‌టాల త‌యారీ కేంద్రాన్ని ప‌రిశీలించారు.

Ttd Eo

TTD EO : టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి గోశాల‌, అగ‌ర‌బ‌త్తులు, డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీతో శ్రీ‌వారి చిత్ర‌ప‌టాల త‌యారీ కేంద్రాన్ని ప‌రిశీలించారు. డ్రైఫ్లవ‌ర్ టెక్నాల‌జీ ద్వారా టీటీడీ, వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం సంయుక్తంగా త‌యారు చేస్తున్న స్వామి, అమ్మ‌వార్ల ల్యామినేటెడ్ ఫోటోలు, పేప‌ర్ వెయిట్స్, కీ చైన్లకు శ్రీ‌వారి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోందని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన కేంద్రంలో డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీతో మహిళలలు త‌యారు చేస్తున్న క‌ళాకృతుల‌ను ఈవో శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాదాపు 200 మంది స్వయం స‌హాయ‌క సంఘాల మహిళా సభ్యులకు డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి ఆరు నెల‌ల‌లుగా స్వామివారి ఆకృతులను, వివిధ క‌ళాకృతుల‌ను తయారు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇది వరకు వివిధ సైజుల్లో స్వామి వారి చిత్రపటాలు తయారు చేసినా, చివరగా A-4 సైజును ఎంపిక చేసుకుని ఎక్కువ సంఖ్యలో చిత్రపటాలు తయారు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక మహిళ రోజుకు రెండు చిత్ర పటాలు తయారు చేయవచ్చన్నారు.

Tirumala : ఏప్రిల్ 1 నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు పునరుధ్ధరణ

ఈ ఉత్ప‌త్తుల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా వేగ‌వంతంగా అనుకూల‌మైన వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు వీలుగా త్వ‌ర‌లో ఒక ప్ర‌త్యేక త‌యారీ కేంద్ర‌ాన్ని సిట్రస్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క‌ళాకృతుల‌ను త‌యారు చేస్తున్న మహిళలను ఈ సంద‌ర్భంగా ఈవో అభినందించారు. వారు కూడా శ్రీ‌వారి చిత్ర‌ప‌టాలు త‌యారు చేసే అవ‌కాశాన్ని త‌మ‌కు అందించి, త‌మ జీవితాల్లో వెలుగు రేఖ‌లు నింపినందుకు టీటీడీకి, సిట్ర‌స్ యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అంతకుముందు ఎస్వీ గోసంరక్షణ శాల, అగరబత్తీల తయారీ కేంద్రాన్ని ఈవో పరిశీలించి సంబంధిత అధికారుల‌కు పలు సూచనలు చేశారు. ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉపకుల‌ప‌తి డాక్ట‌ర్ ప‌ద్మనాభ‌రెడ్డి, సిట్ర‌స్ ప్ర‌ధాన శాస్త్ర‌వేత్త శ్రీ నాగ‌రాజు, ఎస్వీ గో సంర‌క్ష‌ణశాల డాక్ట‌ర్ సుమ‌న్‌ ఈవో వెంట ఉన్నారు.