Unexpected Changes In Rajahmundry Ycp Politics
Unexpected changes in Rajahmundry YCP politics : అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. అది జరిగిపోయాక.. గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ.. రాజమహేంద్రవరం ప్రజలు గుర్తించారు. అధికార పార్టీ కార్యకర్తలు కూడా పట్టేశారు. ఎస్.. రాజమండ్రి వైసీపీలో అద్భుతమే జరిగింది. మూడేళ్లుగా కొనసాగిన వర్గపోరును.. యంగ్ లీడర్స్ అకస్మాత్తుగా పక్కన పెట్టేశారు. అయితే.. రెండు వర్గాలు కలిసిపోయినా.. అక్కడ పార్టీ బలోపేతం సవాల్గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అక్కడ అధికార పార్టీకి ఉన్న వీక్నెస్ ఏంటి? ప్రత్యర్థులు చేతులు కలిపిన తర్వాత.. రాజమండ్రిలో ఏం జరుగుతోంది?
రాజమహేంద్రవరం వైసీపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు ఒక్కటైపోయి.. ఒకే సైన్యంగా మారింది. మూడేళ్లుగా ఉన్న విభేదాలను పక్కనబెట్టి.. ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతులు కలిపారు. పార్టీ బలోపేతానికి కాళ్లు కదిపారు. వచ్చే ఎన్నికల్లో.. పార్టీ విజయమే తమకు ముఖ్యమని.. ఇద్దరు నాయకులు ప్రకటించారు.
Also read : Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక సమరభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..
ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా మధ్య విభేదాలు ఏ రేంజ్లో నడిచాయంటే.. ఒకానొక దశలో కార్యకర్తలు కూడా విసిగిపోయారు. వీళ్లింతే.. ఇక మారరు అన్న దాకా వచ్చారు. కానీ.. వైసీపీలో ఇటీవల జరిగిన సంస్థాగత మార్పులు.. వర్గపోరుకు చెక్ పెట్టేశాయ్. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించింది అధిష్టానం. అదే విధంగా.. ఉభయ గోదావరి జిల్లాలకు.. రీజినల్ కో-ఆర్డినేటర్లుగా.. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వచ్చారు. జిల్లా అధ్యక్షుడయ్యాక.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎవరూ ఊహించని విధంగా.. ఎంపీ భరత్ ఇంటికి వెళ్లారు. దీంతో.. ఇద్దరి మధ్య వర్గపోరుకు ఎండ్ కార్డ్ పడిందని.. ఇకపై అన్నదమ్ముల్లా ఉంటారని.. పార్టీ నాయకులు ప్రకటించారు.
అయితే.. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. వీళ్లిద్దరూ కలిసిపోవడం వల్ల.. రాజమండ్రిలో వైసీపీ బలోపేతమవుతుందా అన్నదే.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా.. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంచార్జ్ వ్యవహారం వైసీపీకి మైనస్ అవుతోందనే చర్చ సాగుతోంది. అటు పార్టీలో ఉన్న వారికి అవకాశం ఇవ్వక.. బలమైన నాయకుడిని పార్టీలోకి తీసుకురాక.. ఆ పోస్టును అలాగే ఖాళీగా ఉంచారు. ఎవరికీ బాధ్యతలు అప్పగించక.. ఇంచార్జ్ విషయం ఎటూ తేల్చకపోవడంతో.. కేడర్ అంతా అయోమయానికి గురవుతోందనే టాక్ వినిపిస్తోంది.
Also read : PM Modi : ప్రధాని షెడ్యూల్లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?
గడప గడపకు వైసీపీ కార్యక్రమం.. రాజమండ్రిలో ఒక వార్డుకే పరిమితమైంది. పార్టీలో తమకు తగిన గౌరవం దక్కడం లేదని రౌతు సూర్యప్రకాశరావు, ఆయన వర్గం.. దూరంగా ఉంటోంది. బలమైన నేతగా పేరున్న శివరామ సుబ్రహ్మణ్యం.. తనకు ఎమ్మెల్యే టికెట్పై భరోసా ఇస్తేనే.. ఇంచార్జ్ పదవి తీసుకొని.. యాక్టివ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. అయితే.. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఓటమిపాలవడం, టీడీపీ కాస్త బలంగా ఉండటంతో.. రాజమండ్రి కో-ఆర్డినేటర్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై.. వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. దీంతో.. ఇప్పట్లో ఇంచార్జ్ నియామకం ఉండదని.. వైసీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. విభేదాలన్నీ పక్కనబెట్టి ఒక్కటైన.. యువ నేతలు ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజానే.. రాజమండ్రిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేయడం మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. కేడర్లో జోష్ తెచ్చేందుకు.. ఉమ్మడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే చర్చ మొదలైంది. జనరల్ ఎలక్షన్స్ కంటే ముందే.. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇవే.. తమ సత్తా చాటేందుకు అసలైన పరీక్ష అని ఫీలవుతున్నారట.