Varla Ramaiah: పోలీసులపై వైసీపీ నాయకుల దాడులు.. వాళ్లు ఇప్పుడెందుకు స్పందించరు?
రాష్ట్రంలో వైసీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తుంటే.. అధికార పార్టీకి వత్తాసుపలికే పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు.
- Harishth Thanniru
- Published On : December 13, 2023 / 08:48 AM IST
Varla Ramaiah
TDP Leader Varla Ramaiah: రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. పోలీసులపై దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయనడానికి నిదర్శనం అన్నారు. కడపలో అనిల్ కుమార్ అనే పోలీసు అధికారిపై స్థానిక వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గం అన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు గతంలో ఎన్నడూచూడలేదని చెప్పారు. గతంలో ఇదే కడపలో హైమావతి అనే సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే ఆమెపై దాడికి పాల్పడ్డారని, బలవతంగా ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారని వర్ల రామయ్య డీజీపికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
విశాఖపట్టణం జిల్లా మూకవరపాడులో వైసీపీ ఎంపీ బంధువులు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారని, సత్యసాయి జిల్లా మోటుకుపల్లిలో వైసీపీ ఎంపీపీ భర్త వేణుగోపాల్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారని వర్ల రామయ్య అన్నారు. ధర్మవరం వైసీపీ నాయకులు హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ నాయకులు అనేక దాడులకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.
Also Read : Prashant Kishor : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!
రాష్ట్రంలో వైసీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తుంటే.. అధికార పార్టీకి వత్తాసుపలికే పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులకు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం కొంతమంది పోలీసులేనని అన్నారు. పోలీసు అధికారులపై దాడులకు పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని లేఖద్వారా వర్ల రామయ్య కోరారు.
