ఒకరి తర్వాత ఒకరు.. ఇప్పుడు విడదల రజినీ చుట్టూ ఉచ్చు!

ఏదైతే అదే జరుగుతుందని ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారంటున్నారు.

Vidadala Rajini: ఒకరు తర్వాత ఒకరు.. కొందరిపై అవినీతి కేసులు.. మరికొందరు దాడులు, దౌర్జన్యాల కేసుల్లో నిందితులు.. మొత్తానికి అందరిపై క్రిమినల్‌ కేసులే.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో నమోదైన కేసులూ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. దీంతో పొలిటికల్‌ స్ర్కీన్‌పై ఓ వెలుగు వెలిగిన నేతలు.. ఉన్నపళంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.

ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేశ్‌, లేళ్ల అప్పిరెడ్డి వంటివారు అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లిపోగా, ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజిని కూడా వారి బాటనే అనుసరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిన రజినిపై వరుసగా అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రజిని ఏం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది…

సైబరాబాద్‌లో నాటిన మొక్కను సార్‌ నేను అంటూ ఏపీ పొలిటికల్‌ స్రీన్‌పై అడుగుపెట్టిన విడదల రజిని వైసీపీలో చేరాక ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉండగా చంద్రబాబును పొగడ్తెలతో ముంచెత్తిన రజిని… వైసీపీలో కూడా జగన్‌పై అంతేస్థాయిలో వీర విధేయత చాటుకునేవారు.

గెలిచిన తొలిసారే మంత్రి
ఈ క్రమంలో రెండున్నరేళ్లపాటు మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. గెలిచిన తొలిసారే మంత్రి అయిన రజిని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో… అంతకు మించిన వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ఆమె పొలిటికల్‌ కెరీర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారనే సస్పెన్స్‌ వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజినిపై అంతులేని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఐదేళ్లు ఓ వెలుగు వెలిగిన రజినిపై వైసీపీ నేతలు కూడా గతంలో మాజీ సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసేవారని చెబుతున్నారు. కానీ, అధినేత చూసీచూడనట్లు వదిలేయడంతో ఆమె మరింతగా దూసుకుపోయారని గుంటూరు జిల్లా టాక్‌. ఐతే ఇప్పుడు అధికారం పోవడంతో మొత్తం పాత వ్యవహారాలన్నీ ఒక్కొక్కిటిగా వెలుగుచూస్తున్నాయి.

జూన్‌లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే… చిలకూరిపేటలో విడదల భూ దందా వెలుగుచూసింది. జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి 16 లక్షల రూపాయల కమీషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై రైతులు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారని చెబుతున్నారు. దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజిని.

రూ.6 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు
ఇక ఎన్నికల ముందు చిలకూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి మల్లుల రాజేశ్‌ నాయుడు నుంచి సుమారు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అప్పటి పార్టీ పెద్దలు పంచాయితీ చేసి కొంత మొత్తం తిరిగిచ్చేశారని చెబుతున్నారు. ఐతే ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం మల్లు రాజేశ్‌నాయుడు సైతం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మల్లుల రాజేశ్‌నాయుడు టీడీపీలో ఉండటంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చుబిగించి తన డబ్బు వసూలు చేసుకోవాలని ఆ పార్టీ పెద్దల సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇలా రాజేశ్‌నాయుడు ఓ వైపు వెంటాడుతుండగా, మరోవైపు చిలకూరిపేట స్టోన్‌ క్రషర్‌ యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదలపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తమ క్రషర్లు నడపాలంటే 5 కోట్లు తనకు ఇవ్వాలని రజిని డిమాండ్‌ చేశారని, లేదంటే 50 కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్‌ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీంతో ఈ కేసుపై రజినిపై చర్యలకు రంగం సిద్ధమవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మూడు నెలలుగా రజిని ఆచూకీ తెలియడం లేదని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు చిలకూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారిన రజిని ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోనూ కనిపించడం లేదంటున్నారు.

పార్టీ అధికారంలో ఉండగా హల్‌చల్‌ చేసిన మాజీ మంత్రి విడదల రజిని, అవినీతి వ్యవహారాలతో వైసీపీ కూడా డిఫెన్స్‌లో పడిపోయిందని చెబుతున్నారు. పార్టీ నేతలు ఎవరూ అండదండగా నిలవకపోవడంతో ఫైనాన్స్‌ మెటర్‌ రచ్చకెక్కకుండా సెటిల్‌ చేసుకోవాలని మాజీ మంత్రి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే కొందరు తాము చెల్లించిన డబ్బుకు వడ్డీ కలిపి ఇవ్వాలని అడుగుతుండటంతో మాజీ మంత్రి చేతులెత్తేస్తున్నారట. ఏదైతే అదే జరుగుతుందని ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారంటున్నారు. మొత్తానికి మిగతా వైసీపీ నేతల వలే రజినిపైనా కేసుల కత్తి వేలాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుల నుంచి ఆమె ఎలా బటయపడతారనేది ఆసక్తికరంగా మారుతోంది.

Also Read: కష్టాలు పునరావృతం కాకూడదని కేసీఆర్ నవగ్రహ యాగం.. పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు