విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 29, 2024 / 04:05 PM IST
vijayawda kanaka durga temple trust board key decisions in 2024
Vijayawda kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజా మండపాల నిర్మాణానికి దుర్గగుడి పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాకు వివరించారు. ఎలివేటెడ్ క్యూలైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్ లోని నిర్మాణాలకు ఒక రూపం తెస్తామని.. దుర్గగుడి అభివృద్ధిపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు. నివేదన సమయంలో వచ్చే వీవీఐపీ భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులపై పాలకమండలి సమావేశంలో చర్చించామని తెలిపారు. ఇకపై ప్రతి రోజూ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వీవీఐపీ భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఉచిత బస్సును త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని, ఘాట్ రోడ్డు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తిచేస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ లో రెండు షిఫ్ట్ లలో దుర్గగుడి ప్రసాదం కౌంటర్లు పనిచేస్తాయన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో టెక్నికల్ కమిటీకి సూచనల మేరకు మరమ్మత్తులు చేస్తామని కర్నాటి రాంబాబు తెలిపారు.
Also Read: వార్షిక బడ్జెట్కు టీటీడీ ఆమోదం.. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1733 కోట్లు
