Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాన్ఫిడెన్స్ ఏంటి.. గోదావరి జిల్లాలపై వైసీపీ ఎందుకు ఫోకస్ పెంచింది?
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 6, 2023 / 01:11 PM IST
Pawan Kalyan Konaseema
Pawan Kalyan Konaseema: తూగో అయినా.. పగో.. అయినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో(godavari districts) ఏ అసెంబ్లీ సీటైనా.. ఒక్కటి.. ఒక్కటంటే.. ఒక్క చోట కూడా వైసీపీ గెలవొద్దని.. గెలవకుండా చేస్తానని.. జనసేనాని(Jana Sena) పవన్ కల్యాణ్ ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ(YCP) కూడా అంతే గట్టిగా గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచింది. సేనాని కామెంట్స్తో అధికార పార్టీ అలర్ట్ అయింది. పైకి.. పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తున్నా.. ఎలాంటి విమర్శలు చేయకపోయినా.. లోలోపల చేయాల్సింది చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అసలు కోనసీమలో ఏం జరుగుతోంది? పవన్ కల్యాణ్ కాన్ఫిడెన్స్ ఏంటి? తేల్చేద్దాం..
ఉభయ గోదావరి జిల్లాలు.. ఏపీలో ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్ (deciding factor) అని చెప్పొచ్చు. ఇక్కడి ప్రజలు ఆశీర్వదిస్తే చాలు.. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలిస్తే చాలు.. ఈజీగా అధికారంలోకి రావొచ్చనే లెక్కలున్నాయ్. అదే సెంటిమెంట్.. ఇప్పటికీ ఆయింట్మెంట్ లా పనిచేస్తోంది. అందుకే అన్ని పార్టీలు ఈ రెండు జిల్లాలను టార్గెట్ చేశాయ్. వీటి పరిధిలో ఉన్న 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో.. మెజారిటీ స్థానాలు కైవలం చేసుకోవాలని చూస్తున్నాయ్. ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే చాలు.. అన్ని పార్టీల చూపు గోదావరి జిల్లాలపైనే పడుతుంది. మిగతా ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక్క కోనసీమలో మాత్రమే పబ్లిక్ పల్స్ (public pulse) ఎవరికీ దొరకదు. అందుకే అన్ని పార్టీలు రాబోయే ఎన్నికల కోసం గోదావరి జిల్లాలను టార్గెట్ చేశాయ్.
కాపు సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రలోనే అధికార వైసీపీకి.. పవన్ సవాల్ విసిరారు. గోదావరి జిల్లాల్లో ఉండే 34 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా వైసీపీకి రాకుండా చూస్తానన్నారు. ఇదే.. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హీట్ రేపుతోంది. ముఖ్యంగా.. వైసీపీలో పవన్ కల్యాణ్ సవాల్ను అధికార పార్టీ సీరియస్గా తీసుకుంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీకి బంపర్ మెజారిటీ వచ్చింది. 34 సీట్లలో.. 27 స్థానాలను వైసీపీ గెలిచింది. దాంతో.. రాబోయే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లోని మొత్తం స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది అధికార పార్టీ. ఆ టార్గెట్తోనే ఉభయ గోదావరి జిల్లాల ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి (Mithun Reddy).. వైసీపీ నేతల మధ్య అక్కడక్కడ ఉన్న విభేదాలను త్వరితగతిన పరిష్కరించి.. గ్రూపులు లేకుండా చేయాలని హైకమాండ్ స్పష్టం చేసిందంటున్నారు.
Also Read: దమ్ము, ధైర్యం ఉంటే.. 34 మందిని సొంతంగా నిలబెట్టు- పవన్ కల్యాణ్కు మంత్రి రోజా సవాల్
మరో వైపు పవన్ చేసిన సవాళ్లపైనా వైసీపీ ఫోకస్ పెట్టింది. గోదావరి జిల్లాల్లో మరింత దూకుడు పెంచాలని డిసైడ్ అయింది. ఇప్పటికే.. జిల్లా అధ్యక్షులతో పాటు మంత్రులకు కూడా సైలెంట్గా సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. పవన్ వారాహి యాత్రకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయ్.. గ్రాఫ్ ఇప్పుడెలా మారిందనే దానిపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది అధిష్టానం. మొన్నటిదాకా గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఖాయమని ధీమాగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు పవన్ యాత్రతో జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల్లో పార్టీ బలంగానే ఉన్నా.. ఎందుకైనా మంచిది.. అలర్ట్గా ఉండటం బెటరనే ఆలోచనతో ఉంది. పవన్ కామెంట్స్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ.. రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు మెజారిటీ స్థానాలు సాధిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
కోనసీమలో పవన్కు, ఆయన పార్టీకి గ్రాఫ్ పెరిగిందా.. వివరాలకు ఈ వీడియో చూడండి
