BJP vs YCP: బీజేపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్
ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడలో నిర్వహించిన సభ.. బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర ఆగ్రహంగా మారింది.
- vamsi
- Published On : December 29, 2021 / 09:49 AM IST
Bjp Ycp
Political Heat Between YCP & BJP: ప్రజాగ్రహ సభ పేరుతో కమళనాథులు విజయవాడలో నిర్వహించిన సభ.. బీజేపీ, వైసీపీ మధ్య పరస్పర ఆగ్రహంగా మారింది. ఈ సభ ఏపీ పాలిటిక్స్లో కొత్త హీట్ రాజేసిందని చెబుతున్నారు. బెజవాడ గడ్డ నుంచి అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలకు వరుస కౌంటర్లు ఇచ్చారు కాషాయ నేతలు. అధికార పార్టీ టార్గెట్గా బీజేపీ నేతలు పంచుల వేశారు.
వైసీపీపై బీజేపీ నేతల విమర్శలు, ఆరోపణలు ఏపీ పాలిటిక్స్లో వేడి రాజేశాయి. ఏపీలో బెయిల్పై తిరుగుతున్న నేతలు.. త్వరలోనే జైలుకు వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్. రాష్ట్రంలో ప్రధానంగా 2, 3 సమస్యలు ఉన్నాయని చెప్పిన జవదేకర్.. టీడీపీ, వైసీపీ ప్రజలను మోసం చేశాయని అన్నారు.
ఈ సంధర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే, మూడేళ్లలో అమరావతిలో రాజధాని నిర్మిస్తామని అన్నారు. తాము సభ పెట్టగానే టీడీపీ, వైసీపీ నేతలకు మర్చిపోయిన విషయాలన్ని గుర్తు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేకంగా హోదా గురించి ప్రస్తావించిన సోము వీర్రాజు.. చంద్రబాబునే ఆ విషయం అడగాలన్నారు.
ఇక బీజేపీ అంటే భవిష్యత్లో జయించే పార్టీ అని.. ఏపీలో కమలదళం ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అంటూ ఒక్కో నేత ఒక్కో స్టైల్లో విరుచుకపడ్డారు. మొత్తానికి ఏపీలో తాము సమరశంఖం మొగించామని చెప్పకనే చెప్పారు బీజేపీ నేతలు.
అయితే నిర్వహించిన ప్రజాగ్రహ సభపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు.. చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అంటూ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మూడేళ్ల తర్వాత ఏపీలో జగన్ పాలన బాగాలేదని గుర్తొచ్చిందా? అంటూ సజ్జల కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
