YCP Fifth List: ఇప్పటికే 68 స్థానాల్లో మార్పులు.. ఇప్పుడు వైసీపీ 5వ లిస్ట్‌ రెడీ.. జాబితాలో వీరి పేర్లు?

గుంటూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా కావటి మనోహర్‌ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణకు అవకాశం దక్కనుంది. మచిలీపట్నంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను బరిలోకి..

YCP Fifth List

వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగనున్నాయి. ఐదో లిస్ట్‌పై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్‌తో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌చార్జ్‌లను మార్చనున్నారు. ఎన్నికల సమరశంఖం పూరించడంతో పాటు పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో రెండ్రోజులపాటు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగిన సీఎం జగన్‌… నేతలతో చర్చిస్తున్నారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు పిలుపు వెళ్లింది. దీంతో నేతలు తాడేపల్లి ఆఫీస్‌కు క్యూ కట్టారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ వెళ్లారు. సీఎంవో పిలుపుతో మంత్రులు అమర్‌నాథ్‌, ఉషశ్రీచరణ్‌ తాడేపల్లికి వెళ్లి చర్చించారు.

మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. కొంతమంది తమ స్థానాల్లో మార్పులపై చర్చిస్తే…మరికొందరు పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ స్థానాలపై ముఖ్యమంగా సీఎం జగన్ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి 58 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. రానున్న జాబితాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఎక్కువగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే 10 ఎంపీ స్థానాలు ప్రకటించగా మరో 10 నుంచి 12 ఇన్‌చార్జ్‌లను ప్రకటించే చాన్స్‌ ఉంది. 3 నుంచి నాలుగు సిట్టింగ్‌లకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొందరిపేర్లు ఖరారయ్యాయి.

ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి లేదా మంత్రి రోజా, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నర్సారావుపేట ఎంపీగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లు ఖరారయ్యాయి. గుంటూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా కావటి మనోహర్‌ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణకు అవకాశం దక్కనుంది.

మచిలీపట్నంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నారు. కాకినాడకు చలమల శెట్టి సునీల్‌ దాదాపు ఖరారయ్యింది. రాజమండ్రి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ రేసులో గూడూరి శ్రీనివాస్‌, పద్మలత పేర్లు ఉన్నాయి. నర్సాపురం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని యోచిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు అనకాపల్లి ఎంపీగా పంపించాలని అధిష్టానం భావిస్తోంది.

అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లకు సంబంధించి మరో నాలుగైదు చోట్ల మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చిన స్థానాల్లోనూ మార్పులు జరగొచ్చని సమాచారం. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి స్థానంలో వెంకటేశ్‌కు టికెట్‌ కేటాయించారు. అయితే.. వెంకటేశ్‌కు వ్యతిరేకత వస్తుండటంతో బుట్టా రేణుక పేరు పరిశీలిస్తున్నారు. రెండ్రోజుల్లో ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మెుత్తం 68 స్థానాల్లో మార్పులు చేశారు. ఈసారి వచ్చే లిస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది.