young man brutally stabbed : ప్రేమోన్మాది కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మైనర్ బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఢిల్లీబాబు కోసం పోలీసులు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. బాలికను హత్య చేసిన తర్వాత.. నిందితుడు అడవిలోకి పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. అయితే అడవిలోనే ఢిల్లీబాబు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటలైనా.. నిందితుడి ఆచూకీ తెలియకపోవడంతో.. 3 బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బాలిక మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
అసలు ఏం జరిగింది ?
దొంగచాటుగా పెళ్లి చేసుకున్న బాలికపైనే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ప్రియుడి కత్తిపోట్ల దాటికి ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి.. ఆ అమ్మాయి మృతికి కారణమైన ఆ కరుడుకట్టిన నిందితుడు పరారీలో ఉండటంతో.. ఢిల్లీ బాబు కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు ఢిల్లీబాబుపై నిర్భయ, దిశ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మూడు బృందాలుగా అతని కోసం గాలిస్తున్నారు.
ఇద్దరి మధ్య ప్రేమ :-
పూతలపట్టు మండలం చింతమాకుల పల్లికి చెందిన ఢిల్లీ బాబు.. తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి అనే బాలిక ఇద్దరు ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం పెద్దలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే విషయం పెద్దలకు తెలియడంతో మందలించారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మైనర్లు కావడంతో వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. మేజర్ అయ్యాక పెళ్లి సంగతి చూద్దామంటూ ఎవరి ఇళ్లకు వారిని పంపించారు.
పెద్దల మందలింపు :-
పెద్దల మందలింపుతో గత కొంత కాలంగా ఢిల్లీబాబును దూరం పెట్టింది గాయత్రి. అతనితో మాటలు తగ్గించింది. కలవడం మానేసింది. దీంతో గాయత్రిపై పగ పెంచుకున్నాడు ఢిల్లీ బాబు. తనను దూరం పెట్టి.. వేరే ఎవరితోనో చనువుగా ఉంటుందనే అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెనుభూతమైంది. దీంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదనే నిర్ణయానికి వచ్చాడు. తనతోనే మాట్లాడాలి.. తననే చూడాలి.. తననే ప్రేమించాలంటూ వేధించాడు.
చంపాలని నిర్ణయం :-
గాయత్రిని చంపాలని నిర్ణయించుకున్న ఢిల్లీబాబు.. మార్కెట్లో కత్తులను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత నిత్యం గాయత్రి వచ్చిపోయే దారిలో మాటు వేశాడు. గాయత్రి రాగానే రెండు కత్తులతో కనికరం లేకుండా పొడిచాడు. కత్తిపోట్లు శరీరంపై లోతైన గాయలు చేయడంతో.. తీవ్రంగా గాయపడింది గాయత్రి. వెంటనే చిత్తూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు.
కేసు నమోదు..దర్యాప్తు :-
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో గాయత్రిని ఢిల్లీ బాబు వేధించాడని పోలీసులు చెబుతున్నారు. గాయత్రి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.