సీఎం అయ్యాక జగనన్న మారిపోయాడు.. అందరినీ దూరం చేసుకున్నాడు: వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
ఎంత మంది త్యాగం చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు? సీఎం అయ్యాక అందరినీ దూరం చేసుకున్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : January 25, 2024 / 12:40 PM IST
ys jagan changed his character after became CM says ys sharmila
YS Sharmila: పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో జగన్ సర్కారు విఫలమైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడ సూర్య కళ మందిరంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతోందన్నారు. వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి జగనే కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేశానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగనన్న మారిపోయారని, తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం అయిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఒక్కసారిగా కూడా జగనన్న మాట్లాడలేదని, అంతగా బీజేపీకి బానిలైపోయారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి ఫణంగా పెట్టారని ఫైర్ అయ్యారు. బీజేపీకి.. వైసీపీ, టీడీపీ అమ్ముడుపోయాయని ఆరోపించారు. మూడు రాజధానులతో ప్రజలను అయోమయంలో పడేశారని.. అసలు రాజధాని ఉందా, లేదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగలా మారిందన్నారు. రైతులకు కనీసం పంటల బీమా అయినా ఇస్తున్నారా అని నిలదీశారు. రాజన్న పాలనకు, జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు.
షర్మిల ఏమన్నారంటే..?
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చిందని, నా కుటుంబానికి చీల్చిందని జగన్ అన్నారు. దేవుడే బుద్ధి చెబుతారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి కుటుంబం వీడిపోయిందంటే జగన్ చేతులారా చేసుకున్నారు. దీనికి సాక్ష్యం దేవుడు, మా అమ్మ, మా కుటుంబం. అప్పట్లో వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉందని చెబితే నా కుటుంబాన్ని పక్కన పెట్టి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఎప్పుడు అవసరమని చెబితే అప్పుడు ఏది అడిగితే అది చేశాను. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాను. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మారిపోయారు. నన్న పక్కన పెట్టినా, ప్రజలకు మంచి చేస్తారని చూశాను. జగన్ పార్టీ, మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ బానిసలుగా మారిపోయారు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్ని విధాలా మోసం చేశాయి.
Also Read: కాంగ్రెస్ మరోసారి మా చెల్లిని ప్రయోగించింది.. ఇక బీజేపీ..: జగన్ సంచలన కామెంట్స్
జగన్ సీఎం అయిన తర్వాత ప్రత్యేక హోదా కోసం మాట్లాడిన సందర్భమే లేదు. జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని బీజేపీకి పణంగా పెట్టారు. ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులని ప్రజలను కాన్ఫ్యుజ్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏమిటో తెలియకుండా చేశారు. బీజేపీకి విశాఖ స్టీల్ నీ కూడా పణంగా పెట్టారు. అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా? రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకుంటే సరిపోదు, పనుల్లో కూడా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగ.. ఇప్పుడు వ్యవసాయం దండగగా మారింది. ఇది రైతు రాజ్యం ఎలా అవుతుంది? అసలు పిల్లలు పెద్ద చదువులు చదవడానికి భరోసా లేదు. చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు.
Also Read: వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?
ప్రస్తుతం నియంత పాలన నడుస్తుంది. కనీసం ప్రజల మాట అలా ఉంచితే ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలవలేరు. రాజశేఖర్ రెడ్డి ప్రతి రోజూ సుమారు ముప్పై మంది ఎమ్మెల్యేలను కలిసేవారు. ఎంతో మంది త్యాగం చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. నీ నా అన్న వాళ్ళను అందరనీ దూరం చేసుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ రెడ్డిని కలిసిన తర్వాత.. రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయాన్ని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న కోరిక తీర్చడానికి నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని షర్మిల అన్నారు.
