YS Sharmila
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెబుతున్నవన్నీ అసత్యాలేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనంటూ ట్వీట్ చేశారు.
“కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోదీకి ఆంధ్రుల హక్కు మీద లేదు. విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయి. మోదీ దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉంది.
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించారు. స్టీల్ ప్లాంట్ ను బ్రతికించారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదు.
ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే JD(S)..రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. NDAకు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మోదీకి సలాం కొడుతున్నాయి. 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనం.
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ముడిసరుకు కొరతతో ఉత్పత్తి తగ్గిందని, ప్లాంట్ దివాలా తీసే స్థాయిలో ఉందని, కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కార్మికులు 1400 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీతో మిట్టల్ స్టీల్ గురించి చర్చ చేస్తున్నారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కి ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడలట. ఇదెక్కడి న్యాయం ?
కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలి. ప్లాంట్ ను SAILలో వెంటనే విలీనం చేయాలి. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలి. భవిష్యత్ లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి. ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే NDA భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేన తప్పుకోవాలి” అని ట్వీట్లో షర్మిల పేర్కొన్నారు.
Praja Darbar: వైఎస్ జగన్ ప్రజాదర్బార్కు భారీ స్పందన.. స్వల్ప ఉద్రిక్తత