Ysrcp Mp Vijaya Sai Reddy
AP Special Status : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీ మేరకు…. ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై రాజ్యసభలో ఈ రోజు వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ చైర్మన్కు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసు ఇచ్చారు.
రాజ్యసభలో ఈ రోజు నిర్వహించే ఇతర వ్యవహారాలు ప్రక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్ కి పలు హామీలు ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది.
2014 మార్చి 1న కేంద్ర మంత్రి మండలి ఈ ప్రత్యేక హోదా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఈ హామీని నేరవేర్చలేదు కాబట్టి ఈ రోజు సభా కార్యక్రమాలను అన్నింటినీ సస్పెండ్ చేసి, సభలో ఈ అంశంపై తక్షణమే చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు.
కాగా….ప్రత్యేక హోదాపై చర్చించాలని కోరుతూ ఈరోజు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.