Chandra Grahan 2026
Chandra Grahan 2026 : ఇవాళ చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం. తెలుగు రాష్ట్రాలపైనా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈసారి చంద్రగ్రహణంకు ప్రత్యేకత ఉంది. ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పిలుస్తారు. అంటే.. చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది.
Also Read : Telugu Naadu: ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అసలు సాధ్యమేనా? కూటమి సర్కార్ దీనికి సిద్ధంగా ఉందా?
మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రుడు సాయంత్రం 6.22 గంటలకు ఉదయిస్తాడు. గ్రహణం 6.47గంటలకు ముగుస్తుంది. అంటే మనకు సుమారు 25 నిమిషాల పాటు పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రారంభంలో గ్రహణం కంటికి కనిపించకపోయినా.. శాస్త్ర ప్రమాణంగా భావించి మధ్యాహ్నం 3.20 గంటలకే పట్టు స్నానం చేయాలి.. సాయంత్రం 6.47గంటలకు గ్రహణ విడుపు స్నానం ఆచరించాలి.
తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6గంటల తరువాత చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు దీన్ని చూసేందుకు వీలుంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్లడ్ మూన్గా పిలిచే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి కండ్ల జోడు, ఇతర రక్షణ పరికరాలు అవసరం లేకుండా నేరుగా దీన్ని చూడొచ్చని, మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రగ్రహణం ముగిసిన తరువాత ఏం చేయాలి..?
చంద్రగ్రహణం ముగిసిన తరువాత ధరించిన బట్టలతో సహా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ దోషం తొలగుతుంది. అలాగే పవిత్ర జలంతో ఇంటిని శుభ్రం చేసి పసుపు నీళ్లతో ప్రోక్షణం చేయాలి. అనంతరం దీపం వెలిగించి దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తరువాత చేసే దానం ఎంతో మంచిదని చెబుతుంటారు. కాబట్టి బియ్యం, పాలు, తెల్లటి వస్త్రాలు, వెండి వంటివి దానం చేయడం వలన చంద్ర దోషాలు తొలగిపోతాయని నమ్మకం.