Amazon, Flipkartలకు 2020 కష్టమే: Reliance వచ్చేస్తోంది

టెలికాం ఇండస్ట్రీలో ఇంతింతై ఎదిగిపోతున్న రిలయన్స్.. ఈ కామర్స్‌పై దృష్టి పెట్టింది. 2020లో మరింత రాబట్టాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. లాభాలతో దూసుకెళ్తూ మార్కెట్ వాల్యూ టాప్‌లో ఉన్న రిలయన్స్ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఫోకస్ చేయడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు చిక్కు వచ్చి పడింది. తమ మార్కెట్‌ను విస్తరించుకోవాలని చూస్తున్న ఈ షాపింగ్ సైట్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ స్టోర్లు ఓపెన్ చేసి సేవలు మొదలుపెట్టాయి. 

అడుగుపెట్టిన అనతికాలంలోనే పబ్లిసిటీతో పాటు మార్కెట్ ను విస్తరించగల రిలయన్స్ ఈ కామర్స్ సైట్‌లోకి వచ్చిందంటే వీటి పరిస్థితి ఢమాల్ అనాల్సిందే. పండుగలకు గానూ.. ఫెస్టివ్ సేల్స్ అని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ లాభాలే దండుకుంటున్నాయి. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో లాభాలను దక్కించుకున్నాయి. 

కేవలం సెప్టెంబరు 29నుంచి అక్టోబరు 4 మధ్య సమయంలో భారత్ లోని ఆన్‌లైన్ రిటైలర్లు రూ.19వేల కోట్లు సంపాదించారు. బెంగళూరుకు చెందిన రెడ్ సీడర్ కన్సల్టింగ్ ఆధారంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కలిసి మార్కెట్‌లోని 90శాతం అమ్మకాలను దక్కించుకున్నాయి. లాభాలతో దూసుకెళ్తోన్న ఈ-కామర్స్ దిగ్గజాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు అంతే లాభపడ్డారు. 

వచ్చే ఏడాది దీపావళిని టార్గెట్ చేసుకుని బరిలోకి దిగనున్న రిలయన్స్ ఈ రెండింటికీ గట్టి పోటీ ఇవ్వనుంది. డిస్కౌంట్లతో కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో.. రిలయన్స్ సంస్థకు మించిన తెలివితేటలు మరెవ్వరికీ లేవు. దండగ వస్తున్నా మార్కెట్లో స్థిరపడేందుకు భారీ తగ్గింపులతో సిద్ధమవుతోంది. ఇది పర్‌ఫెక్ట్‌గా అమలు అయితే ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్లతో ఖరీదైన వస్తువులు సొంతం చేసుకోవచ్చు. 

ఇప్పటికే ఆహారం, నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న రిలయన్స్.. 6వేల 600నగరాల్లో 10వేల 415స్టోర్లతో భారతదేశ వ్యాప్తంగా బిజినెస్ చేస్తుంది.