×
Ad

మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా? శుభవార్త..! ఏమేం మారబోతున్నాయంటే? తెలుసుకోవాల్సిందే..

ఈ సమావేశంలో ఉపాధి ప్రోత్సాహక పథకం అమలుపై కూడా సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది.

EPFO

EPFO Board: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కేంద్ర ట్రస్టీ బోర్డు (సీబీటీ) సోమవారం సమావేశం అవుతుంది. తొమ్మిది నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ మార్పు, ఉపాధి ప్రోత్సాహక పథకం వంటి ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో ప్రధాన అంశం ఈపీఎఫ్ఓ 3.0. ఇది సంస్థ డిజిటల్ వ్యవస్థ ఆధునికీకరణ లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టు. ఉపసంహరణలు, బదిలీలు, క్లెయిమ్‌ల వంటి ప్రక్రియలను వేగంగా, సులభంగా మార్చడమే దీని ఉద్దేశం. లక్షల మంది సభ్యులకు అనుకూలంగా సేవలు అందించేలా ఈ ప్రాజెక్టులో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు పాల్గొంటున్నాయి. (EPFO Board)

ఈపీఎఫ్ఓ 3.0 ప్రణాళిక కార్యకలాపాలను సులభతరం చేయడం, ఆలస్యాలను తగ్గించడం, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నారు. దీని వల్ల పదవీ విరమణ సమయంలో వచ్చే డబ్బులు, పెన్షన్ నిర్వహణ వంటివి మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

Also Read: దీపావళి ఎప్పుడు? 20ననా లేదా 21ననా? కరెక్ట్ డేట్.. పూజ టైమ్ ఇదే.. ఇలా చేస్తేనే సంపద వస్తుంది..

ఈ సమావేశంలో ఉపాధి ప్రోత్సాహక పథకం అమలుపై కూడా సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’గా పిలుస్తున్నారు.

ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2025 జూలైలో ఆమోదించగా, ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల వ్యవధిలో, 2027 జూలై నాటికి 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడం దీని లక్ష్యం. వీటిలో సుమారు 1.92 కోట్ల ఉద్యోగాలు తొలిసారి వ్యవస్థీకృత ఉద్యోగ రంగంలో ప్రవేశించే కార్మికులకు కేటాయిస్తారని అంచనా.

అధికారిక అజెండాలో లేకపోయినప్పటికీ ఈపీఎస్-95 కింద ఇస్తున్న కనిష్ఠ పెన్షన్ సవరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ.1,000 కనిష్ఠ పెన్షన్‌ తమ ప్రాథమిక అవసరాలకు సరిపోవట్లేదని పెన్షనర్లు విమర్శలు చేస్తున్నారు.

పెన్షనర్లతో పాటు కార్మిక సంఘాలు దీన్ని పెంచాలని కోరుతున్నాయి. ఈపీఎఫ్ఓ బోర్డు కనిష్ఠ పెన్షన్‌ను నెలకు రూ.2,500కి పెంచే అంశాన్ని పరిశీలించవచ్చని తెలుస్తోంది. ఇది 11 ఏళ్ల తర్వాత జరగనున్న మొదటి సవరణ అవుతుంది. ఈ మార్పు అమలుకు ప్రభుత్వ అనుమతి అవసరం.