Money (Image Credit To Original Source)
Bombay High Court: కోటక్ సెక్యూరిటీస్ సిస్టమ్ లోపం వల్ల ఓ స్టాక్ ట్రేడర్ ఖాతాలో దాదాపు 40 కోట్ల రూపాయల మార్జిన్ జమైంది. అతడు వెంటనే ఈ డబ్బును స్టాక్స్లో పెట్టేశాడు. దీంతో 20 నిమిషాల్లోనే అతడికి 1.75 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది.
ఈ విషయాన్ని గుర్తించిన కోటక్ సెక్యూరిటీస్ ఆ వ్యక్తితో మాట్లాడింది. తమ డబ్బు తమకు ఇచ్చేయాలని చెప్పింది. దీంతో అతడు తన ఖాతాలో జమ అయిన రూ.40 కోట్లను తిరిగి ఇచ్చాడు. అతడికి వాటి వల్ల లాభంగా వచ్చిన రూ.1.75 కోట్లను మాత్రం ఇవ్వలేదు.
ఆ డబ్బు కూడా ఇవ్వాలని కోటక్ డిమాండ్ చేసింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో బాంబే హైకోర్టులో కేసు వేసింది. అయితే, సాంకేతిక లోపం కారణంగా తప్పుగా జమ చేసిన మార్జిన్ ద్వారా వచ్చిన లాభాలు అన్యాయ సంపాదన కిందకి రావని పేర్కొంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోటక్ సెక్యూరిటీస్ అభ్యర్థనను తిరస్కరించింది.
Also Read: భారత్లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది.. ఇక భవిష్యత్తులో రోగులు అందరూ..
మూడేళ్లుగా కేసులో విచారణ
ఈ కేసు 2022కి చెందింది. తాజాగా ఇందుకు సంబంధించి హైకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఇది ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ట్రేడర్ గజానన్ రాజ్గురు ఖాతాలో బ్రోకర్ కోటక్ సెక్యూరిటీస్ సిస్టమ్ లోపం వల్ల దాదాపు 40 కోట్ల రూపాయల మార్జిన్ తప్పుగా జమైంది.
ఆ డబ్బు జమ అయిన తరువాత సుమారు 20 నిమిషాల్లో రాజ్గురు ట్రేడ్లు చేశాడు. ఆ ట్రేడ్ల ద్వారా చివరకు 1.75 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది. ఇలా లాభంగా వచ్చిన డబ్బు రాజ్గురుకే చెందుతుందని బాంబే కోర్టు పేర్కొంది.
సాంకేతిక లోపం వల్ల అదనపు మార్జిన్ అందుబాటులో ఉండటం మాత్రమే రాజ్గురుకు వచ్చిన లాభాలకు కారణం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మొదట రాజ్గురుకు 54 లక్షల రూపాయల నష్టం వచ్చింది. తర్వాత 2.38 కోట్ల రూపాయల లాభం వచ్చింది. చివరకు 1.75 కోట్ల రూపాయల నికర లాభం మిగిలింది.
ఈ తప్పు మార్జిన్ జమ వల్ల కోటక్ సెక్యూరిటీస్కు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని కోర్టు స్పష్టం చేసింది. ట్రేడర్ తీసుకున్న నిర్ణయాలు, నైపుణ్యం, రిస్క్ స్వీకరణ వల్లే లాభాలు వచ్చాయని పేర్కొంది. తప్పుగా అందించిన మార్జిన్ ఉపయోగించారనే కారణంతో బ్రోకర్ (కోటక్) వాటిని తిరిగి కోరడానికి వీలు లేదని తెలిపింది. ఈ తీర్పును కోటక్ సెక్యూరిటీస్ సవాల్ చేసింది. ఫిబ్రవరి 4న ఈ కేసు మళ్లీ విచారణకు రానుంది.