Electric Air Taxi : భారతదేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్చర్ ఏవియేషన్తో కలిసి 2026వ సంవత్సరంలో భారతదేశం అంతటా ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. భారతదేశ కార్యకలాపాల కోసం 200 ఆర్చర్స్ మిడ్నైట్ ఎయిర్క్రాఫ్ట్ల కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తోంది.
7 నిమిషాల్లోనే గమ్యస్థానానికి…
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కేవలం 7 నిమిషాల్లో ఎయిర్ టాక్సీలో ప్రయాణికులను తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్డు మార్గంలో 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 60 నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది. భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్ను ప్రారంభించడానికి రెండు కంపెనీలు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కార్గో, మెడికల్ ఎమర్జెన్సీ సేవలు
ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్లో భాగం. అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్లలో అగ్రగామి సంస్థ.‘‘అర్బన్ ఎయిర్ టాక్సీ సేవలతో పాటు, కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సర్వీసెస్తో పాటు ప్రైవేట్ కంపెనీ, చార్టర్ సర్వీసెస్తో సహా భారతదేశంలోని ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ కోసం వివిధ రకాల ఇతర వినియోగ సేవలను కొనసాగించాలని యోచిస్తున్నాం’’ అని ఆ ప్రకటన తెలిపింది.
Also Read : Manushi Chhillar : వెండి చీరలో మెరిసిన అందాలరాశి…మానుషి ఛిల్లార్ను చూద్దాం రండి
ఆర్చర్స్ ఎయిర్క్రాఫ్ట్ను ఆపరేట్ చేయడానికి, ఫైనాన్స్, వెర్టిపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైన పైలట్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసిన వ్యాపార భాగస్వాములతో కలిసి పని చేయాలని భావిస్తున్నారు. ఇంటర్గ్లోబ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా, ఆర్చర్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిఖిల్ గోయెల్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఎయిర్ టాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చని ఇంటర్ గ్లోబ్ తెలిపింది.