Reliance Jio working on 'Bharat GPT' with IIT-B to launch OS for televisions
Jio Bharat GPT : దేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే (IIT-B) భాగస్వామ్యంతో ‘భారత్ జీపీటీ’ అనే ప్రొగ్రామ్ ప్రారంభించేదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు అంబానీ చెప్పారు. ప్రత్యేకించి టెలివిజన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఐఐటీ బాంబే వార్షిక టెక్ఫెస్ట్లో పాల్గొన్న ఆకాష్ అంబానీ.. ఎకోసిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. అందులోభాగంగానే జియో 2.0 విజన్ వర్క్ ప్రాసెస్ నడుస్తోందని చెప్పారు.
Read Also : Amazon Q ChatGPT : ఏఐ చాట్జీపీటీకి పోటీగా అమెజాన్ బిజినెస్ ‘క్యూ’ చాట్బాట్ వచ్చేసింది..!
ఐఐటీ బాంబే భాగస్వామ్యంతో ఏఐ ప్రాజెక్టు :
2014 నాటి రిలయన్స్ జియోతో ప్రీమియర్ టెక్ స్కూల్ భాగస్వామ్యంపై ఆకాష్ అంబానీ మాట్లాడారు. భారత్ జీపీటీ ప్రోగ్రామ్ను లాంచ్ చేసేందుకు ఐఐటీ బాంబే భాగస్వామ్యంతో ఏఐ ప్రాజెక్ట్పై పనిజరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక భవిష్యత్ మొత్తం జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్టులు, సంబంధిత సర్వీసులపైనే ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. ఏఐతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని అంబానీ చెప్పారు. కేవలం ఒక జియోలోనే మాత్రమే కాకుండా, తమ సంబంధిత అన్ని రంగాలలో కూడా ఏఐ ప్రొగ్రామ్ ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
టెలివిజన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ :
అంతేకాదు.. వాణిజ్యం, స్పేస్ సెక్టార్, మీడియా, కమ్యూనికేషన్, డివైజ్లలో కూడా ఇదే తరహా ప్రొడక్టుల సర్వీసులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే టెలివిజన్ల కోసం సొంత ఆపరేటింగ్ (OS)ను ప్రవేశపెట్టేందుకు పనిచేస్తున్నామని ఆకాష్ అంబానీ చెప్పారు. ఇదేలా ప్రారంభించాలి అనేదానిపై లోతుగా అన్వేషిస్తున్నామన్నారు. అంబానీ ఫ్యామిలీకి 2024 అనేది ఒక ప్రత్యేక సంవత్సరమని చెప్పారు. ఎందుకంటే.. ఈ ఏడాది తన సోదరుడు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిపారు.
Reliance Jio working on ‘Bharat GPT’ with IIT-B to launch OS for televisions
అదేవిధంగా కొత్త ఏడాదిలో 5జీ నెట్వర్క్లను మరింత విస్తరించడంపై చాలా ఆసక్తిగా ఉన్నామని అన్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని రకాల సంస్థలకు 5జీ స్టాక్ను అందించనున్నట్టు తెలిపారు. వచ్చే దశాబ్ధంలో భారత్ అతిపెద్ద ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా నిలువనుందని, దశాబ్ధం చివరినాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.
టెక్నాలజీ అనేది గ్రేట్ ఈక్వలైజర్ :
రిలయన్స్ జియోను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్గా అభివర్ణించారు. ముఖ్యంగా, యువ పారిశ్రామికవేత్తలు విఫలమవుతారనే భయాందోళన అవసరం లేదన్నారు. కొత్త వ్యవస్థాపకులు ఎవరైనా సరే తమ పని పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉండాలన్నారు. టెక్నాలజీ అనేది గ్రేట్ ఈక్వలైజర్గా పేర్కొన్న ఆయన.. అది జనాభా, కులాలతో సహా సరిహద్దులను అధిగమించిందని చెప్పారు. భవిష్యత్తులో ఇదే టెక్నాలజీలో మార్పులపై రిలయన్స్ జియో ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉంచుతుందని ఆకాష్ అంబానీ తెలిపారు.