Gold: గోల్డ్‌ బాండ్లు ఇకలేవు.. ఇప్పుడు బంగారంలో పెట్టుబడులు వీటిలో పెడితే డబ్బులే డబ్బులు

ఇప్పుడు ఇతర మార్గాలను వెతుకుతున్నారు ప్రజలు.

Gold Rate Today

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) బాండ్స్‌ జారీకి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అప్పటివరకు బంగారంలో మదుపు చేయాలనుకునే వారు నిరాశకు గురయ్యారు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ లో ఇక పెట్టుబడి పెట్టే అవకాశం లేకపోవడంతో ఇతన ఆప్షన్లవైపునకు చూస్తున్నారు. దేశంలో బంగారాన్ని ఆభరణాలుగా బాగా వాడతారు. అంతేగాక, పసిడిని పెట్టుబడులకు కూడా బాగా ఉపయోగిస్తారు.

దీంతో డిజిటల్‌ గోల్డ్‌ దిశగా పెట్టుబడి మళ్లించాలన్న తలపుతో కేంద్ర సర్కారు 2015లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్కీమ్‌ కింద 67 విడతలుగా మొత్తం 14.7 కోట్ల యూనిట్ల సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను సర్కారు ఇచ్చింది.

Also Read: హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌ల డేట్స్ ఇవే.. మొత్తం 9.. ఇక విశాఖలో మాత్రం జస్ట్..

ఇప్పుడు ఆ పథకం లేకపోవడంతో ఇప్పుడు డిజిటల్‌ ఫార్మాట్‌లో బంగారంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు లిస్టెడ్‌ ఎస్‌జీబీలు, గోల్డ్‌ ఈటీఎఫ్‏ల దిశగా మళ్లవచ్చు. కేంద్ర సర్కారు పదేళ్లలో జారీ చేసిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ బీఎస్‌ఈతో పాటు ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

దీంతో డీమ్యాట్‌ అకౌంట్‌ ఉన్న రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ ఇరు స్టాక్‌ ఎక్స్‌చేంజీల క్యాష్‌ సెగ్మెంట్‌లో 8 ఏళ్ల వ్యవధితో ఉండే ఎస్‌జీబీల యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌ ఉంటుంది. 5, 6, 7 సంవత్సరాల ఖరిలో రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఈ బాండ్లకు బై బ్యాక్‌ సౌకర్యం అందిస్తుంది.

ఇక గోల్డ్‌ ఈటీఎఫ్‏ల విషయానికి వస్తే… పెట్టుబడి పెట్టుకోవాలనుకునేవారు వీటిలోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇచ్చే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోనూ మదుపు చేయవచ్చు. ఇందులో ప్రతి గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఓ గ్రాము పసిడికి సమానం.

ఈ స్కీమ్‌లతో సమీకరించిన ఫండ్స్‌ను మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫిజికల్‌ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌గా పెడతాయి. ప్రతి ట్రేడింగ్‌ డే ఆఖరిలో ఆ తేదీని పసిడి మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఈ యూనిట్ల ఎన్‌ఏవీని ప్రకటిస్తారు. ఇవి కూడా లిస్టై ఉండడంతో ఇన్వెస్టర్లు అవసరం ఉన్న సమయంలో వీటిని విక్రయించుకోవచ్చు.