తృటిలో తప్పిన ప్రమాదం… ప్రాణాలతో బయటపడ్డ గాయకుడు విజయ్ యేసుదాస్

  • Publish Date - November 3, 2020 / 09:31 PM IST

Singer Vijay Yesudas’s car meets with road accident :  ప్రముఖ మళయాళ గాయకుడు విజయ్ యేసుదాసుకు ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టిన ఘటనలో ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

సోమవారం, నవంబర్2వతేదీ రాత్రి 11-30 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిసి తిరువనంతపురం నుంచి కొచ్చిన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కొచ్చిన్ కు వస్తుండగా, అలప్పు జిల్లాలో….తైక్కట్టుసేరి రోడ్డు నుంచి మరో కారు జాతీయ రహదారిపై కి ఒక్కసారిగా దూసుకొచ్చింది.



ఒక్క సారిగా రోడ్డుపైకి  వచ్చిన కారును చూసి విజయ్ డ్రైవింగ్ కంట్రోల్ తప్పాడు. అంతే ఎదుటి కారు వచ్చి విజయ్ కారును ఢీకొట్టింది. కాగా ఈప్రమాదంలో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం సంగతి తెలుసుకున్న కుతియాధోడ్ పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు.

ప్రమాదానికి ఎవరు కారణం అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి నుంచి మరోక కారులో కొ్చ్చిన్ చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయి ఇటీవలే 20 ఏళ్ళు కెరీర్ పూర్తి చేసుకున్నాడు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో పలు పాటలను పాడిన విజయ్ 2007, 2013 మరియు 2019 లో ఉత్తమ గాయకుడిగా మూడుసార్లు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.