వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్చినమవుతున్నాయని తెలిసినా చాలామంది వాటిపట్ల ఆకర్షితులవుతూ కుటుంబాల్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్లను నమ్ముకున్న వాళ్లను ఒంటరి చేసి వెళ్లి పోతున్నారు. వివాహేతర సంబంధం ఊళ్లో వారికి తెలిసి పోయిందని ఓ ఇల్లాలు, ప్రియుడితో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు తల్లిలేని పిల్లలయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా బౌసింగ్ తండా గ్రామపంచాయతీ వంపుతండాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వంపు తండాకు చెందిన దేవమ్మ @ పార్వతి(30)కి అదే తండాకు చెందిన రాజుతో 10 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. రాజు డోజర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. దేవమ్మ అదే తండాకు చెందిన శివనాయక్ (22) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
నాయక్ ఆమెకు వరసకు అల్లుడవుతాడు. రాజు డ్యూటీకి వెళ్లినప్పుడు దేవమ్మ, నాయక్ రాసలీలల్లో మునిగిపోయేవారు. గుట్టుగా సాగుతున్న వీరి అక్రమ సంబంధం విషయం తండాలో కొంత మందికి తెలిసింది. ఈ విషయమై నలుగురు చర్చించుకోవటం మొదలైంది. ఇది తెలిసి దేవమ్మ నాయక్ లు తమ బండారం బయట పడుతుందని భయపడ్డారు.
శుక్రవారం, జులై17 రాత్రి ప్రేమికులిద్దరూ కలిసి కొన్నూరు క్రాస్ రోడ్డ్డు వద్ద పెద్ద తొక్కుడోని బండ వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్ధితి లోకి వెళ్లారు. అటు వైపుగా పొలాలలకు వెళుతున్న గ్రామస్తులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
108 అంబులెన్స్ ను పిలిచి చికిత్స నిమిత్తం వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించటంతో మెరుగైన చికిత్స కొసం మహబూబ్ నగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పనున్నట్లు ఎస్ఐ తిరుపాజీ చెప్పారు.