అన్న వరసయ్యే వ్యక్తితో ప్రేమ… తండ్రి మందలించాడని….

  • Publish Date - October 26, 2020 / 09:41 AM IST

school girl suspicious death : అన్నవరస అయ్యే వ్యక్తితో ప్రేమాయణం వద్దన్నందుకు ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

నార్నూర్ పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసే ఇందూరు ఊశన్న-వసంతలది ఆదిలాబాద్ గ్రామం. భార్య వసంత ఆదిలాబాద్ లో అంగన్ వాడీ విధులు నిర్వహిస్తుండగా ఆశన్న నార్నూర్ లో పని చేస్తున్నాడు. వీరికి వైష్ణవి ఒక్కతే కుమార్తె. ఏకైక కూతురును భార్య భర్తలు గారంగా పెంచారు.



వైష్ణవి ఆదిలాబాద్ లో 10వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ కారణంగా కూతురు వైష్ణవితో ఊశన్న నార్నూర్ లోని పోలీసు క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. కాగా రెండేళ్లక్రితం వైష్ణవి వరసకు అన్న అయిన తన పెద్దమ్మ, బావగారి కొడుకుతో ప్రేమలో పడింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి గతంలోనే వారిని మందలించారు. ఇదే విషయమై తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

ఆమెకు కౌన్సెలింగ్ చేసినా ఆమెలో మార్పు రాలేదు. కాగా…. శుక్రవారం అక్టోబర్ 23 రాత్రి, తన ప్రియుడితో ఫోన్ లో చాటింగ్ చేస్తుండగా గమనించిన తండ్రి మందలించాడు. తెల్లారి లేచి చూసే సరికి బాలిక విగతజీవిగా పడి ఉంది.



మనస్ధాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా బాలిక మృతి అనుమానాస్పదంగా ఉందని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్ధలాన్ని ఉట్నూరు డీఎస్పీ ఉదయ్ రెడ్డి పరిశీలించారు.