Terrorists Open Fire : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాష్ట్రంలోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై విచక్షణ లేకుండా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణించే యాత్రికులు 10 మంది అక్కడిక్కడే మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు.
Read Also : వైసీపీ అందుకే ఓడిపోయింది: జగన్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
యాత్రికులు శివఖోడి గుహ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సుపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడి రాళ్లకు గట్టిగా ఢీకొనడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది. మృతదేహాలు ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటన స్థలి వద్ద అనేక ఖాళీ బుల్లెట్ కేసింగ్లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకోగా, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోడ్డు పక్కన నిలబడిన స్థానికులు సహాయక చర్యలలో సాయం చేస్తున్నట్లు సంఘటన స్థలం నుంచి దృశ్యాలు బయటకు వచ్చాయి. పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను చికత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.