ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా
ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా తీసుకుని వికృత చర్యలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలపై వెకిలి చేష్టలకు పాల్పడుతూ, భయాందోళనకు గురి చేస్తున్నారు. కరోనా వైరస్ తో విలవిలలాడిపోతున్న ముంబైలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిపై ఓ యువకుడు ఉమ్మివేసి పారిపోయాడు. ఊహించని ఘటనతో ఆ యువతి షాక్ కి గురైంది. కరోనా భయంతో వణికిపోతోంది.
ఈ ఘటన ముంబైలోని మణిపూర్ వోకాలా పోలీసు స్టేషన్ పరిధిలోని కలినా మిలిటరీ క్యాంపు సమీపంలో చోటు చేసుకుంది. ఓ యువతి నిత్యావసర వస్తువులు కొనేందుకు తన స్నేహితురాలితో కలిసి బయటకు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చాడు. మాస్క్ తీశాడు. గుట్కా తింటున్న యువకుడు యువతి దుస్తులపై ఉమ్మేశాడు. ఆ తర్వాత బైక్ పై పరారయ్యాడు. ఈ ఘటనతో ఆ అమ్మాయి షాక్ తింది. తనకు కరోనా సోకుతుందేమోనని ఆందోళన చెందుతోంది.
దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిపై ఉమ్మి వేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కరోనా సోకిన వారు ఉమ్మివేస్తే అది తమకూ సోకుతుందని ప్రజలు భయపడుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని కొందరు ఆకతాయిలు ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు.(గుడ్ న్యూస్, మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు)
ఇలాంటి ఘటన ఇటీవలే ఢిల్లీలో జరిగింది. ఇప్పుడు ముంబైలోనూ చోటుచేసుకుంది. ఢిల్లీలో మణిపూర్ మహిళపై ఉమ్మేసిన ఘటన కలకలం రేపింది. ఇప్పుడు ముంబైలోనూ బాధితురాలు మణిపూర్ యువతే. దీంతో ఇది జాతి వివక్షగానూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య భారత మహిళలపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోకిరీల తాట తీసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే అకారణంగా రోడ్డుపైకి వచ్చిన వారిని తమదైన స్టైల్ లో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. అయినా ఇంకా కొందరు పోకిరీలు రెచ్చిపోతూనే ఉన్నారు.