సకాలంలో స్పందించిన పోలీసులు – ఉరితాడు కోసి ప్రాణం నిలిపారు

cops rescued married woman who commits suicide : కుటుంబ కలహాలతో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు యత్నించగా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె ప్రాణాలు కాపాడారు జూబ్లీహిల్స్ పోలీసులు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–5లోని దుర్గాభవానీనగర్‌ బస్తీలో నివసించే రమావత్‌ సిరి (45) అనే వివాహిత మహిళ శనివారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చిస అదే ఫ్రాంతంలోని ఓ ఖాళీ ప్లాటులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది.

ఈ విషయాన్ని పక్క ప్లాటులో ఉన్న విశ్వనాథ్‌రెడ్డి అనే అడ్వకేట్‌ గమనించారు. వెంటనే ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ శేఖర్‌ వెంటనే గస్తీ పోలీసులను అక్కడికి వెళ్లమని పంపించారు. మరోవైపు విశ్వనాధ రెడ్డిని ఆమె వద్దకు వెళ్ళి చెట్టకు కట్టుకున్న తాడు తెంపేయమని రిక్వెస్ట్ చేశారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఘటనా స్ధలం వద్దకు వెళ్ళమని పురమాయించారు. తాను కూడా వెంటనే అక్కడకు బయలుదేరి వెళ్లారు.

అయిదు నిమిషాలవ్యవధిలోనే బ్లూకోట్స్ సిబ్బంది సందీప్, బాల పెద్దన్న, లతో కలిసి అడ్వకేట్ విశ్వనాధరెడ్డిలు అక్కడకు వెళ్లి తాడు కోసేసి…. చెట్టుకు వేళాడుతున్న మహిళను కిందకు దించారు. ఎస్ఐ ఆదేశాలు అందుకున్న 108 సిబ్బంది కూడా సరైన సమాయానికి అక్కడకు చేరుకుని చెట్టునుంచి కిందకు దించిన మహిళకు ప్రాధమిక చికిత్స చేసి ఆక్సిజన్ అందించి ప్రాణం నిలబెట్టారు.

దీంతో ఆమె గంట సేపట్లోనే సాధారణ స్ధితికి చేరుకుంది. మహిళ అత్మహత్య విషయంలో పోలీసులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేవి. అందరూ సకాలంలో స్పందించటంతో మహిళకు పునర్జీవితాన్ని ప్రసాదించారు.