Enforcement Directorate : మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రిని విచారిస్తున్న ఈడి అధికారులు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన మనీలాండరింగ్ వ్యవహారంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం
- chvmurthy
- Updated on- February 23, 2022 / 01:43 PM IST
Maha Minister Nawab Malik
Enforcement Directorate : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన మనీలాండరింగ్ వ్యవహారంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం 4గంటలకు నవాబ్ మాలిక్ ముంబైలోని ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం గం.7 లనుంచి ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అక్రమ ఆస్తులు, కొద్దిరోజుల క్రితం అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్తో సహా ….పలు అనుమానిత నిందితులతో నవాబ్ మాలిక్ కు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. దావూద్ ఇబ్రహింకి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా ఆరా తీస్తూ ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి నవాబ్ మాలిక్… దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈడి అధికారులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీం కస్కర్ను అరెస్టు చేసిన తర్వాత… విచారణలో అతడు పలు కీలక రహస్యాలను ఈడి కి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఇబ్రహిం కస్కర్ వెల్లడించిన విషయాల ఆధారంగానే… నవాబ్ మాలిక్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినట్లు ఈడి వర్గాలు వెల్లడించాయి.
Also Read : Police Constable : పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి-బంగారం చోరీ కేసులో అరెస్ట్
ఈ కేసు దర్యాప్తులో భాగంగా… కొంతకాలం క్రితం ముంబై, పుణె సహా చాలా ప్రదేశాలలో దాడులు నిర్వహించిన ఈడి ఆ సమయంలో ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయని ఈడి వర్గాలు వెల్లడించాయి. తమ దాడుల్లో లభ్యమైన పత్రాలపైనే ఈడి వివరంగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. నవాబ్ మాలిక్ ఈడి కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్నికూడా ఈడి అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.
