Man Kills 5 Members Of Family
Maharashtra : మహారాష్ట్రలోని నాగపూర్లో కుటుంబ కలహాల నేపధ్యంలో ఒక వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లల్ని, అత్తగారిని, మరదలిని హత్యచేసాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం నాగపూర్లోని పచ్పవోలి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
స్ధానికంగా టైలరింగ్ వ్యాపారం చేసుకుని జీవిస్తున్న అలోక్ మతుకార్ అనే వ్యక్తి సోమవారం తెల్లవారు ఝూమున తన భార్య విజయ(40) గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం తన కుమార్తె పారి(14) కుమారుడు సాహిల్(12)లను కూడా గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడకు దగ్గరలోనే ఉన్న అత్తగారింటికి వెళ్లి అత్త లక్ష్మీబోబ్డే(55) మరదలు అమీషా బోబ్డే(21)లను గొంతుకోసి హత్య మార్చాడు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉదయం 9 గంటలైనా ఇంట్లోనుండి ఎవరూ బయటకు రాకపోవటంతో పొరుగింటివారు అనుమానం వచ్చి కిటికీలోంచి తొంగి చూడగా మంచంపై రక్తపు మడుగులో మృతదేహాలను
చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ
కలహాల కారణంగానే మతుకార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.