Man shot dead: ట్రాక్టర్ నడపొద్దన్నందుకు హత్య
ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్డు పాడవుతుందని హెచ్చరించినందుకు బంధువునే కాల్చిచంపారు కొందరు వ్యక్తులు. ఒడిశాలోని దెన్కనల్ జిల్లాలో ఆదివారం జరిగింది ఈ ఘటన.
- Narender Thiru
- Published On : April 17, 2022 / 06:33 PM IST
Man Shot Dead
ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్డు పాడవుతుందని హెచ్చరించినందుకు బంధువునే కాల్చిచంపారు కొందరు వ్యక్తులు. ఒడిశాలోని దెన్కనల్ జిల్లాలో ఆదివారం జరిగింది ఈ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందపల్ గ్రామానికి చెందిన నృపాటి నాయక్, పక్కనున్న గ్రామం నుంచి ట్రాక్టర్పై మట్టి తీసుకొస్తుండేవాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం ట్రాక్టర్పై మట్టి తెస్తుండగా, నృపాటికి బంధువైన దలేయి నాయక్ అడ్డుకున్నాడు. అసలే బాగులేని రోడ్డుపై ట్రాక్టర్ నడిపితే, గ్రామంలోని రోడ్డు మరింత పాడవుతుందని, ట్రాక్టర్ నడపొద్దని హెచ్చరించాడు.
Man shot dead: ఫుడ్ సర్వ్ చేయలేదని హోటల్ యజమానిని కాల్చిచంపిన వైనం
వెంటనే నృపాటి కోపంతో, తన తండ్రి, సోదరుడికి ఫోన్ చేసి పిలిచాడు. దేశీ తుపాకీతో అక్కడికి చేరుకున్న ఇద్దరూ రావడంతోనే దలేయిపై కాల్పులు జరిపారు. స్థానికులు దలేయిని ఆసుపత్రికి తరలిస్తుండగా, అప్పటికే మరణించాడు. దలేయి మృతితో కోపోద్రిక్తులైన అతడి బంధువులు నిందితుడి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో నిందితుడి భార్య, మూడేళ్ల కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. బంధువులు నిందితుడి భార్య, కుమారుడిపై దాడి చేశారు. మరో నిందితుడి ఇంటికి నిప్పంటించారు. నిందితుడి భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
