మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా? 

రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

  • Publish Date - March 10, 2020 / 02:36 AM IST

రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?

రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..? కారణం ఏదైనా.. ఒక్క మరణం వంద సందేహాలను మిగిల్చింది. మారుతీరావు అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆరోపణలు.. విమర్శనాస్త్రాలు.. కౌంటర్‌ ఎటాక్‌లు మొదలయ్యాయి. ఇంతకీ మారుతీరావు సంపాదించింది ఎంత..? అవన్నీ ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి..? బినామీల గుట్టు తేలేదెలా..? ఇప్పుడివే ప్రశ్నలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

మారుతీరావు.. మొదట్లో కిరోసిన్‌ వ్యాపారి. కాలం కలిసిరావడంతో అంచెలంచెలుగా ఎదిగాడు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడించాడు. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంచి బిజినెస్‌మెన్‌గా అందరికీ సుపరిచితుడయ్యాడు. ఆయన కూతురు అమృత ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక.. అల్లుడు ప్రణయ్‌ని చంపి సమాజంలో విలన్‌గా మారాడు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ వెనుక కారణాలేంటని ఆరాతీసే టైమ్‌లోనే ఆస్తులు బినామీల లొల్లి బయటపడింది. 

మారుతీరావు  ఆత్మహత్య వెనుక శ్రవణ్ ఉన్నాడని ఆరోపించింది అమృత. ఆస్థి వివాదంలో మారుతీరావుపై శ్రవణ్‌ చేయి చేసుకున్నట్టు తన దగ్గర సమాచారం కూడా ఉందంది. మారుతీరావు ఆస్తులకు కరీం బినామీగా ఉన్నాడని కూడా అమృత స్పష్టం చేసింది. అమృత ఆరోపణలను ఖండించిన కరీం.. మారుతీరావు, శ్రవణ్‌ల మధ్య ఎప్పటినుంచో ఆస్తి తగాదాలున్నాయన్నాడు. కరీం వ్యాఖ్యలపై అంతగా స్పందించని శ్రవణ్‌.. అమృత ఆరోపణలపై భగ్గుమన్నాడు. మారుతీరావు చనిపోయాక తండ్రన్న సంగతి అమృతకు గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు. 

ఆరోపణలు, విమర్శలపై ఎవరికి వారు కౌంటర్లు వేస్తున్నా.. మారుతీరావు ఎపిసోడ్‌లో విలన్‌ ఎవరన్నది మిస్టరీగా మారింది. మారుతీరావు బినామీలు ఎవరు..? ఎవరెవరి పేర్ల మీద ఎంతెంత ఆస్తులు ఉన్నాయో తెలుస్తుందా అన్నది కూడా అనుమానంగానే మారింది. 

See Also | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు…. టీడీపీ, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు