టీడీపీకి ఎంపీ తోట నర్సింహం రాజీనామా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
తూర్పు గోదావరి : టీడీపీకి ఎంపీ తోట నర్సింహం రాజీనామా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ, టీడీపీ ఫ్లోర్ లీడర్ పదవికి కూడా రాజీనామా చేశానని.. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా లోక్సభ స్పీకర్కు పంపినట్లు చెప్పారు. మార్చి 12 మంగళవారం వీరవరంలో తోట నర్సింహం సతీమణి వాణితో కలిసి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీగా తాను సమర్థవంతంగా పని చేశానని తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాత్రీపగలు విశ్రమించకుండా నిరసనలు, ఆందోళనలు కొనసాగించిన కారణంగా తాను అనారోగ్యానికి గురయ్యానని పేర్కొన్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఆరోగ్యం లెక్క చేయకుండా పనిచేసినా.. తనపట్ల కనీసం మానవత్వం చూపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం స్పందించకపోవడంతోనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీడీపిలోకి వచ్చిన మరో పార్టీ ఎమ్మెల్యే తన కార్యకర్తలను అణగదొక్కారని ఆరోపించారు.
తనకు అనారోగ్య కారణాల వల్ల పెద్దాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి తోట వాణిని పోటీ చేయిస్తున్నానని పేర్కొన్నారు. ఒక్కరోజులోనే పార్టీ అధిష్టానం తన సతీమణికి పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు. తన కుటుంబంతో కలిసి మార్చి 13 బుధవారం హైదరాబాద్లో జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేరుతామని ఆయన స్పష్టం చేశారు.