Nathuni Pal Alive : యూపీలో విచిత్ర ఘటన.. 17ఏళ్ల క్రితం హత్యకు గురైన బిహార్ వ్యక్తి బతికే ఉన్నాడు..!
Nathuni Pal Alive : బిహార్ పోలీసు రికార్డుల్లో హత్యకు గురైన వ్యక్తిని ఝాన్సీ పోలీసులు గుర్తించడంతో కేసు నాటకీయ మలుపు తిరిగింది.

Man returns home in Bihar
Nathuni Pal Alive : ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడని అనుకున్న 50 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు తిరిగి వచ్చాడు. యూపీలోని ఝాన్సీ జిల్లాలో 17 ఏళ్ల క్రితం బిహార్ వ్యక్తి హత్యకు గురైనట్టు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ వ్యక్తి సజీవంగానే దొరికాడు. ఈ హత్య కేసులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన నిందితులకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. అందులో బాధితుడి మామ, ముగ్గురు సోదరులు అతన్ని హత్య చేశారనే ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించారు.
నివేదిక ప్రకారం.. నిందితుల్లో బాధితుడి మామ మరణించగా, ముగ్గురు సోదరులు ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. ఈ నెల 6న సాధారణ పెట్రోలింగ్లో బిహార్ పోలీసు రికార్డుల్లో హత్యకు గురైన వ్యక్తిని ఝాన్సీ పోలీసులు గుర్తించడంతో కేసు నాటకీయ మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఆ వ్యక్తిని బిహార్లోని డియోరియా నివాసి నాథుని పాల్గా గుర్తించారు. ఆ వ్యక్తి 6 నెలలుగా గ్రామంలో ఉంటున్నట్లు గుర్తించారు.
ఆ వ్యక్తి ఒంటరిగా గ్రామంలో నివసిస్తుండగా, ఇటీవల ఝాన్సీకి తిరిగి వచ్చినట్లు వెల్లడైంది. “నేను చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు మరణించారు. నా భార్య చాలా కాలం క్రితం నన్ను విడిచిపెట్టింది. నేను బిహార్లోని నా ఇంటికి వెళ్లి 16 ఏళ్లు అయ్యింది” అని అతను చెప్పుకొచ్చాడు. 2008లో ఆకోడిగోల పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో అతని బంధువులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు బెయిల్పై విడుదల కావడానికి ముందు రెండేళ్లపాటు జైలులో ఉన్నారని విచారణలో తేలింది.
నాథుని హత్య కేసులో నలుగురి బంధువులకు జైలుశిక్ష :
“దేవారియా గ్రామానికి చెందిన నాథుని పాల్ కనిపించకపోవడంతో 2008లో సెప్టెంబర్ 12న అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. బాధితుడి నలుగురు బంధువులు అతని భూమిని లాక్కొని హత్య చేశారని కుటుంబం ఆరోపించారు. దాంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఆ సమయంలో పాల్ మృతదేహాన్ని వెలికితీయలేకపోయామని ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ శర్మ వెల్లడించారు. నలుగురు బంధువులైన రతీ పాల్, విమ్లేష్ పాల్, భగవాన్ పాల్, సత్యేంద్ర పాల్ అరెస్ట్ అయ్యారని, వారు బెయిల్పై విడుదలకు ముందు రెండేళ్లపాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని శర్మ తెలిపారు.
మేం కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారు : నిందితుల ఆవేదన
హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోదరుల్లో ఒకరైన సతేంద్ర పాల్ మాట్లాడుతూ.. “పోలీసుల ఎఫ్ఐఆర్లో నా చిన్న సోదరుడి పేరు కూడా ఉంది. అయితే, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ను అభ్యర్థించడంతో అతడి పేరు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. “మా నాన్న, నేను, ఇద్దరు సోదరులు ఒక్కొక్కరు 8 నెలలు జైలు జీవితం గడిపాం.

Nathuni Pal Alive
ప్రస్తుతం మేం బెయిల్పై బయట ఉన్నాం”అని చెప్పుకొచ్చాడు. నాథుని పాల్ బ్రతికే ఉన్నాడని తెలియగానే సతేంద్రుడు కృంగిపోయాడు. చివరకు ఈ హత్య కేసు నుంచి ఇప్పటికైనా విముక్తి పొందామన్నారు. మేం జైలులో గడిపిన రోజులు, కోర్టు చుట్టూ తిరుగుతూ గడిచిన విలువైన సంవత్సరాలను మాకు ఎవరు తిరిగి ఇస్తారు’’ అని హత్య కేసులో నిందితుల్లో ఒకరైన భగవాన్ పాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
2008లో గ్రామాన్ని విడిచివెళ్లిన నాథుని పాల్ :
నివేదిక ప్రకారం.. ఝాన్సీ పోలీసులు మాట్లాడుతూ.. నాథుని పాల్ తన గ్రామంలో నివసిస్తున్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారని వెల్లడించారు. పెళ్లయి కొన్నాళ్లకు పిల్లలు పుట్టకపోవడంతో భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో అతడు తన బంధువులతో కలిసి మరో ప్రాంతానికి వెళ్లాడు. అతనికి కొంత భూమి కూడా ఉంది. 2008లో గ్రామం విడిచి వెళ్లి తిరిగి రాలేదు. అలా తిరుగుతూ 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు.
నాథుని పాల్ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా అతన్ని యూపీలోని ఝాన్సీలో పట్టుకున్నారు. విచారణలో ఝాన్సీ పోలీసులు బీహార్ పోలీసుల రికార్డులలో అతడు హత్యకు గురైనట్టుగా ఉందని తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని తన స్వగ్రామానికి తీసుకొచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్య కేసు ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ, తదుపరి విచారణకు నాథుని పాల్ను బిహార్ పోలీసులకు అప్పగించారు.