Operations Fail Three Women Died : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. ఈ నెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా.. నలుగురికి ఫెయిలయ్యాయి. ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వాత నలుగురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. అందులో ముగ్గురు ప్రాణాలు వదిలారు.
మరొకరికి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మాడ్గులకు చెందిన మమత, సీతారాంపేట్ గ్రామానికి చెందిన లావణ్య నిన్న మృతి చెందగా.. లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ ఇవాళ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుల కుటుంబసభ్యులు ఆస్పత్రిని ముట్టడించారు. సాగర్, హైదరాబాద్ హైవేపై ధర్నాకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే.. తమ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.