వరంగల్ రూరల్ జిల్లాలో వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ
వరంగల్ రూరల్ జిల్లాలో వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ భావించారు. అయితే.. పోలీసుల ఎంట్రీతో అసలు నిజాలు బయటికొస్తున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే కన్నకొడుకును తల్లిదండ్రులు అతి కిరాతకంగా చంపారని తేలింది.
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్తాలపల్లిలో జరిగిందీ ఘటన. కొడారి ప్రభాకర్, వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర. ఇతనికి రజితతో పెళ్లి అయింది. కొడుకు, కూతురు ఉన్నారు. మహేష్చంద్ర వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అయితే తాగుడుకు బానిసైన మహేష్ చంద్ర డబ్బుల కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసుగుచెందిన భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. భార్య లేకపోవడంతో మహేష్, తన తల్లిదండ్రులను ఆస్తి పంచి ఇవ్వాలంటూ వేధించాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి కుటుంబ కలహాలతో మహేష్చంద్ర కళ్లలో కారం కొట్టిన తల్లిదండ్రులు కర్రతో అతడిపై దాడి చేశారు. ఆ తరువాత చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మద్యం మత్తులో ఉన్న మహేష్ తప్పిచుకోవడానికి వీలు లేకుండా రెండు చేతులు కట్టేసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహేశ్పై దాడి జరుగుతున్న క్రమంలో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా ప్రభాకర్, వేములమ్మ దాడికి దిగారు.
వేములమ్మ, ప్రభాకర్ పై ముస్తాపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసం కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులను గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు.