Nuzividu IIIT student suicide case in progress : నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి(20) ఆత్మహత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు.ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు.
మాధురి ఆత్మహత్యకు ముందు… ఆమె స్వస్ధలం కాకినాడకు చెందిన దాసరి వినయ్ అనే యువకుడితో ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడింది. వినయ్ తీవ్ర వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాకినాడలో వినయ్ ను అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు పోలీసులు వినయ్ పై ఐపీసీ సెక్షన్ 306 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో మొల్లి మాధురి (20) సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం హోలీ కావడంతో కాలేజీకి సెలవు ఇచ్చారు. విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉన్నారు.
ఐ3 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో తన రూమ్లోనే మాధురి ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తోటి విద్యార్థినులు భోజనానికి రమ్మని పిలవగా తాను తరువాత తింటానని, మీరు తినేసి రమ్మని బదులిచ్చి రూమ్లోనే ఉండిపోయింది. దీంతో వారు మెస్కు వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చిన తరువాత రూమ్ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కేర్టేకర్కు చెప్పారు.
దీంతో కేర్టేకర్ సెక్యూరిటీ వాళ్లకు తెలపగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా మాధురి ఉరివేసుకుని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి.
ఈమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గాంధీనగర్. మాధురి కాకినాడకు చెందిన దాసరి వినయ్ తో ప్రేమలో ఉంది. ఆమెమృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తోటి విద్యార్ధినులు కూడా తెలిపారు. ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసుల వినయ్ ను అరెస్ట్ చేశారు.